పుట్టిన 3 రోజులకే... పసిగుడ్డుకు కరోనా... ఈ పాపం వాళ్లదే అంటున్న తండ్రి..
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ పసిగుడ్డుకు కరోనా వైరస్ సోకింది. పుట్టిన మూడు రోజులకే ఆ పసిపాపతో పాటు తల్లికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. కరోనా వైరస్ పేషెంట్ ఖాళీ చేసిన బెడ్ను వీరికి కేటాయించడంతో.. తల్లీబిడ్డలకు కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు. ముంబైలోని చెంబూరులో ఉన్న సాయి ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన అతి తక్కువ వయసు బేబీ ఈ పసిపాపే కావడం గమనార్హం.అంతకుముందు లాక్ డౌన్ కారణంగా తాము 10 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాలేదని.. ఆసుపత్రికి వచ్చాకే కరోనా సోకిందని వారి కుటుంబం ఆరోపిస్తోంది.
పాప తండ్రి ఏమంటున్నాడు..
'కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మేము జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అందుకే నా భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాక.. అక్కడ ప్రత్యేక గది బుక్ చేయించాను. అయినప్పటికీ.. డెలివరీ అయిన రెండు గంటల తర్వాత.. ఆ గదిని ఖాళీ చేయాల్సిందిగా సిబ్బంది ఆదేశించారు. అనంతరం నా భార్య,బిడ్డను వేరే బెడ్ పైకి మార్చారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. మాతో వారేమీ చెప్పలేదు. ఆ మరుసటి రోజు డాక్టర్ మమ్మల్ని పిలిచి కరోనా వైరస్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా చెప్పాడు. దాంతో మాకు అనుమానం వచ్చింది.' అని పాప తండ్రి పేర్కొన్నాడు.
వైద్య సిబ్బందిపై ఆరోపణలు
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్యాబిడ్డలకు కరోనా సోకిందని అతను ఆరోపించాడు. కరోనా పేషెంట్ ఖాళీ చేసిన బెడ్ను తన భార్యకు కేటాయించడం వల్లే ఇలా జరిగిందన్నాడు. ఆసుపత్రిలో చేరడం కంటే ముందు లాక్ డౌన్ కారణంగా 10 రోజులు ఇంట్లోనే ఉన్నామని చెప్పాడు. కాబట్టి ఆసుపత్రిలోనే వైరస్ సోకి ఉంటుందని అన్నాడు. పైగా డెలివరీ కోసం ఆసుపత్రిలో అదనంగా డబ్బు కూడా కట్టించుకున్నారని.. కానీ డెలివరీ తర్వాత చిన్నపిల్లల వైద్య నిపుణులు గానీ,ఇతరత్రా డాక్టర్లు గానీ తన భార్యాబిడ్డల వద్దకు వచ్చి మళ్లీ చెక్ చేయలేదని ఆరోపించాడు.
Recommended Video
డాక్టర్లు పట్టించుకోలేదని..
మార్చి 27వ తేదీ నుంచి ఒక్క నర్సు గానీ డాక్టర్ గానీ భార్యాబిడ్డలను పట్టించుకోలేదని.. తమను పూర్తిగా వదిలేశారని ఆరోపించాడు. తమకు పుట్టిన మొదటి బిడ్డకే కరోనా పాజిటివ్గా తేలడం,తన భార్య కూడా కరోనా బారినపడటం బాధగా ఉందన్నాడు. మంగళవారం(మార్చి 30)న తన భార్యాబిడ్డలను కర్ల బాబా ఆసుపత్రికి.. అక్కడినుంచి కస్తూర్బా ఆసుపత్రికి తరలించినట్టు చెప్పాడు. ప్రస్తుతం అక్కడ 120 మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. అతని భార్యాబిడ్డలను అదే ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచి.. అతన్ని కూడా క్వారెంటైన్ వార్డులో చేర్చారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశం మొత్తంలో 2094 పాజిటివ్ కేసులు నమోదవగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 338 మంది వైరస్ బారినపడ్డారు. అత్యధికంగా 39మంది ఈ రాష్ట్రంలోనే మృత్యువాతపడ్డారు.