ప్రారంభమైన నెల రోజులకే కూలిన వంతెన...రూ.263 కోట్లు నీళ్ల పాలు, భారీ వర్షాలతో..!
బీహార్: బీహార్లో గోపాల్ గంజ్ ప్రాంతంలో గందక్ నదిపై ప్రభుత్వం ఒక వంతెన నిర్మించడం జరిగింది. ఈ వంతెన కోసం ప్రభుత్వం అక్షరాల రూ.260 కోట్లు వెచ్చించింది. ఎంత ఘనంగా ఖర్చు చేసిందో అంతే ఘనంగా ప్రారంభోత్సవం కూడా చేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. అంతా బాగానే ఉంది. బ్రిడ్జిని ప్రారంభించి ఒక నెలరోజులు గడవక ముందే ఆ వంతెన నీళ్లపాలైంది. అదే అక్కడ కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. రూ.260 కోట్లు నీళ్ల పాలయ్యాయి.
Recommended Video
భారీ వర్షాలకు కూలిన వంతెన
బీహార్ను గత కొద్ది రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వస్తున్నాయి. గోపాల్ గంజ్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదనీరు కూడా ఇందుకు తోడవడంతో నదిలో నీరు మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక గందక్ నదిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ఈ వరద ధాటికి కుప్పకూలింది. రోడ్డును బ్రిడ్జిని అనుసంధానం చేసే కల్వర్టులు నీటి ఉధ్రృతి ద్వారా వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకపోయాయని అధికారులు చెబుతున్నారు. చాలావరకు కల్వర్టులు వరద నీటిలో మునిగిపోయాయి.
వంతెన నిర్మాణం కోసం రూ.263 కోట్లు ఖర్చు
ఇక సత్తార్ఘాట్ బ్రిడ్జ్గా పిలువబడే ఈ వంతెన పొడుగు 1.4 కిలో మీటర్లు. గత నెల జూన్ 16న ఈ వంతెన ప్రారంభించడం జరిగింది. బీహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ ఈ బ్రిడ్జి నిర్మాణంను 8 ఏళ్ల క్రితం ప్రారంభించింది. అంతా పూర్తయ్యి ప్రారంభం జరిగిన నెలలోపే బ్రిడ్జి కూలడం పలువురిని కలచివేసింది. బ్రిడ్జి కూలడం నిర్మాణలోపం అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వంతెన కోసం ఖర్చు పెట్టిన రూ.260 కోట్లు ఒక్కసారిగా నీళ్లు పాలయ్యాయి. ఇక ఈ బ్రిడ్జి కూలడంతో విపక్షాలు నితీష్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డాయి.
నితీష్ ప్రభుత్వం దోపిడీకి అలవాటుపడింది: తేజస్వీ
బ్రిడ్జి నిర్మాణంకు పట్టిన సమయం 8ఏళ్లని, ఇందుకు ఖర్చు చేసిన మొత్తం రూ.263 కోట్లు కాగా కనీసం 29 రోజులు కూడా ఈ వంతెన సరిగ్గా నిలవలేదని ఆర్జేడీ నేత మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. అవినీతికి భీష్మపితామహుడు అయిన నితీష్ కుమార్ దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం వహించడం వెనక అర్థమేంటని తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. అంతేకాదు బీహార్లో ఎక్కడ చూసిన దోచుకోవడం పరిపాటై పోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో సాధించాలని చూపే ప్రయత్నం నితీష్ కుమార్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తేజస్వీ యాదవ్. వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన సంస్థను బ్లాక్ లిస్టులో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తేజస్వీ యాదవ్.
ఎలుకలు కూల్చాయని చెప్పకండి
ఇక ఈ బ్రిడ్జి నిర్మాణంకు అయిన ఖర్చు రూ.263 కోట్లు కాగా జూన్ 16న ప్రారంభమైందని జూలై 15న కూలిందని కాంగ్రెస్ నేత మదన్ మోహన్ ఝా మండిపడ్డారు. వంతెన కూలడానికి కారణం ఎలుకలు అని మాత్రం చెప్పకండి అంటూ నితీష్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. జూన్ 16న రాష్ట్ర సచివాలయం నుంచి పలు ప్రారంభోత్సవాలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చేపట్టారు నితీష్ కుమార్. ఈ ఫోటోలను కూడా ఆయన పోస్టు చేశారు. ఇదిలా ఉంటే వంతెన కూలడంతో ఏమేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేసేందుకు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.