అందుకు బీజేపీలోకి రాలేదు, ఇంకా చూడలేదు: జీవిత ఆనందం
హైదరాబాద్: తనను సెన్సార్ బోర్డులోకి తీసుకోవడం పైన దర్శక, నిర్మాత జీవిత ఎక్సైట్మెంట్కు గురువుతోందట. సెన్సార్ బోర్డు సభ్యురాలిగా తనను తీసుకోవడంపై జీవిత స్పందించారు. సెన్సార్ బోర్డు కొత్త జట్టు ఎవరినీ అసంతృప్తికి గురి చేయదని చెప్పారు.
బోర్డులోకి తీసుకోవడం పట్ల తాను చాలా సంతోషిస్తున్నానని చెప్పారు. ఈ పోస్ట్ చాలా బాధ్యతతో కూడినదని చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న సినిమా వివాదాల పైన తాను స్పందించదల్చుకోలేదని చెప్పారు. అయితే, కొత్త సభ్యులు, సెన్సార్ బోర్డు చీఫ్ మాత్రం ఎవరినీ అసంతృప్తికి గురి చేయదన్నారు.
దక్షిణాది నుండి సెన్సార్ బోర్డుకు తీసుకోవడం చాలా మంచి విషయమన్నారు. తమను విస్మరించనందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పారు. ఎంఎస్జీ - మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రం వివాదం పైన స్పందిస్తూ.. తాను ఇంకా ఆ చిత్రాన్ని చూడలేదని, ఇప్పుడే దాని పైన స్పందించడం సరికాదన్నారు.
ఏదో ఫలితం ఆశించి తాను భారతీయ జనతా పార్టీలో చేరలేదని ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ చెప్పారు. తన భర్త రాజశేఖర్ రాజకీయాల్లోకి వచ్చింది సమాజానికి మేలు చేసేందుకేనని చెప్పారు. రాజకీయాలకు, పదవికి సంబంధం లేదన్నారు. విమర్శలను పట్టించుకోనని, విమర్శించే వాళ్లు ఎక్కడైనా ఉంటారన్నారు.
కొత్త సెన్సార్ బోర్డు కార్యవర్గం పైన బీజేపీ ఒత్తిళ్లు ఉండవని చెప్పారు. బీజేపీ అలాంటి రాజకీయాలను ఎప్పుడు ప్రోత్సహించదని చెప్పారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమల సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖకు తెలిపి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.