తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు-ఏపీకి ప్రశాంత్ మిశ్రా-తెలంగాణకు సతీశ్ చంద్ర శర్మ
తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో ఛీఫ్ జస్టిస్ లను మారుస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కొహ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో ఆమె స్ధానంలో కర్నాటక హైకోర్టు యాక్టింగ్ సీజేగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మను తెలంగాణ సీజేగా కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఛత్తీస్ ఘడ్ హైకోర్టుకు మార్చారు. దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు క్రిమినల్ కేసుల వేగవంతానికి ప్రయత్నిస్తున్న సుప్రీంకోర్టు ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ గా గతేడాదే భాధ్యతలు చేపట్టిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఏడాది కూడా పూర్తి కాకముందే ఛత్తీస్ ఘడ్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన స్ధానంలో ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ సీజేగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఏపీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండు నియామకాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు చేసిన సిఫార్సులను కేంద్రం, రాష్టపతి ఆమోద ముద్ర వేస్తే నియామకాలు అమల్లోకి వస్తాయి.
వాస్తవానికి ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరిని గతేడాది సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.. ఆయన స్ధానంలో జస్టిస్ అరూప్ గోస్వామిని నియమించింది. కీలకమైన మూడు రాజధానుల కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ నియామకం అప్పట్లోనే సంచలనం రేపింది. ఆ తర్వాత జస్టిస్ అరూప్ గోస్వా్మి ఈ ఏడాది ఆరంభంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా మూడు రాజధానుల కేసు విచారణ ప్రారంభించారు. రెగ్యులర్ విచారణ జరిపే లోపే ఆయన కూడా ఇప్పుడు బదిలీ అయ్యి ఛత్తీగ్ ఘడ్ వెళ్లబోతున్నారు. దీంతో మూడు రాజధానుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. మూడు రాజధానులపై జస్టిస్ అరూప్ గోస్వామి ధర్మాసనం నవంబర్ 15న రెగ్యులర్ విచారణ చేపట్టాలని భావించినా ఈ బదిలీ కారణంగా సాధ్యం కావడం లేదు.