దేశంలో కరోనా కొత్త వేరియంట్: తెలంగాణ సహా ఆ 10 రాష్ట్రాల్లో గుర్తింపు: కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలన కావట్లేదు. ఏదో ఒక కొత్త రూపంలో పుట్టుకొస్తూనే ఉంది.. గడగడలాడిస్తోనే ఉంది. భారత్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల పెరుగుదల కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంటోంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశంలో కొత్తగా 16,135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13,958 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో యాక్టివ్ కేసుల సంక్య 1,13,864గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.85 శాతానికి పెరిగింది. ఇదివరకు ఈ సంఖ్య 1-2 శాతంలోపే నమోదయ్యేది.
ఈ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ కొత్త బాంబు పేల్చింది. భారత్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు వెల్లడించింది. బీఏ 2.75 (BA.2.75) వేరియంట్గా నిర్ధారించినట్లు పేర్కొంది. భారత్లో కనీసం 10 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం సబ్ వేరియంట్ను గుర్తించినట్లు ఇజ్రాయెల్ శాస్త్రవేత్త, షెబా మెడికల్ సెంటర్ సెంట్రల్ వైరాలజీ ల్యాబొరేటరీ డాక్టర్ షాయ్ ఫ్లెయిషాన్ ప్రకటించారు. ఇప్పటివరకు కోవిడ్ వైరస్ సీక్వెన్సులకు సంబంధించిన 65 వేరియంట్లను గుర్తించామని అన్నారు.
మహారాష్ట్ర-27, పశ్చిమ బెంగాల్-13, కర్ణాటక-10, మధ్య ప్రదేశ్-5, తెలంగాణ-2, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో ఒకటి చొప్పున ఈ రకానికి చెందిన వేరియంట్ను గుర్తించినట్లు డాక్టర్ షాయ్ వివరించారు. మరో ఏడు దేశాల్లో కూడా ఇదే వేరియంట్ పుట్టుకొచ్చినట్లు చెప్పారు. ఈ వేరియంట్కు చెందిన వైరస్ వ్యాప్తి చెందినట్లు ఇంకా నిర్ధారణ కాలేదని, దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నామని పేర్కొన్నారు.
దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్పందించింది. కొత్త వేరియంట్లు పుట్టుకురావడం ఊహించిందేనని, వైరస్ ఎప్పటికప్పుడు తన మ్యూటెంట్లను మార్చుకుంటుందని అన్నారు. దీనిపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి కోవిడ్ వ్యాప్తి చెందట్లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము అప్రమత్తంగా ఉన్నామని, కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొటోకాల్స్ను అమల్లోనే ఉన్నాయని చెప్పారు.