లాక్ డౌన్ 2.0 : కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవే.. ఏవేవీ బంద్.. వేటికి మినహాయింపు..
రెండో విడత లాక్ డౌన్కు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో కూడిన ఈ గైడ్ లైన్స్ ఏప్రిల్ 15 నుంచి మే 3వ తేదీ వరకు అమలులో ఉంటాయి. తాజా గైడ్ లైన్స్లో బహిరంగ ప్రదేశాలు,పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే కఠిన శిక్షతో పాటు జరిమానా తప్పదని స్పష్టం చేసింది.
Recommended Video
ఏవేవీ బంద్..
అంతరాష్ట్ర,అంతర్ జిల్లా ప్రయాణాలు,మెట్రో సర్వీసులు,బస్సు సర్వీసులను మే 3వ తేదీ వరకు రద్దు చేసింది. అన్ని రకాల విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్లు,దేశీ,విదేశీ విమాన సర్వీసులు,రైల్వే సర్వీసులను కూడా మే 3 వరకు రద్దు చేసింది. అలాగే సినిమా థియేటర్లు,షాపింగ్ మాల్స్,షాపింగ్ కాంప్లెక్సులు,జిమ్నాజియం,స్పోర్ట్స్ కాంప్లెక్సులు,స్విమ్మింగ్ పూల్స్,బార్లను కూడా రద్దు చేసింది. సామాజిక రాజకీయ కార్యక్రమాలు,స్పోర్ట్స్ ఈవెంట్స్,మతపరమైన కార్యక్రమాలు,ప్రార్థనా మందిరాలు కూడా రద్దయిన జాబితాలో ఉన్నాయి.
వేటికి మినహాయింపు..
ఏప్రిల్ 20వ తేదీ నుంచి వ్యవసాయం, ఉద్యానం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మండీలకు(ధాన్యం కొనుగోలు కేంద్రాలు)కు అనుమతినిచ్చింది. అలాగే ఫార్మా తయారీ యూనిట్లు,మెడికల్ డివైజ్,మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ కన్స్ట్రక్షన్లను కూడా ఏప్రిల్ 20వ తేదీ నుంచి అనుమతించింది. అలాగే హైవేల పక్కనుండే దాబాలు,ట్రక్కు రిపేర్ షాప్స్,ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన కాల్ సెంటర్ కేంద్రాలకు కూడా అనుమతినిచ్చింది. ఇక కిరాణ దుకాణాలు,పండ్ల షాపులు,కూరగాయల దుకాణాలు,పాల కేంద్రాలు,పౌల్ట్రీ,మాంసం,చేపల షాపులకు కూడా లాక్ డౌన్ పీరియడ్లో అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల నిర్వహణకు ఏప్రిల్ 30 నుంచి అనుమతినిచ్చింది. అయితే సోషల్ డిస్టెన్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
అక్కడ మాత్రం యథావిధిగా లాక్ డౌన్
తాజా గైడ్ లైన్స్లో ఇచ్చిన మినహాయింపులు కరోనా వైరస్ హాట్ స్పాట్స్ లేదా కంటైన్మెంట్ జోన్లలో వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ గైడ్ లైన్స్ను తప్పనిసరిగా పాటించాలని.. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణతో పాటు దేశ ఆహార భద్రత,ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ కొత్త గైడ్ లైన్స్ను రూపొందించింది.