కేంద్రంలో ఈసారి అధికార పీఠం ఎవరిది?.. అక్కడ ఏ పార్టీ గెలిస్తే వాళ్లదేనా కుర్చీ?
ఢిల్లీ : పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ స్థానం కీలకం. ఆ సెగ్మెంట్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారో, అదే పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదేదో జోస్యం కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవం. 1951 మొదలు ఇప్పటివరకు 16 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే.. 13 సార్లు అక్కడ గెలిచిన అభ్యర్థుల పార్టీయే అధికారంలోకి రావడం విశేషం. అందుకే ఆ స్థానంపై ప్రధాన పార్టీలు కన్నేశాయి. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉన్నాయి. ఆ ఒక్క స్థానంలో పక్కాగా గెలిస్తే సెంట్రల్ కుర్చీ ఖాయమనే రీతిలో సమరభేరికి సిద్ధమయ్యారు.
సెంటిమెంట్.. లక్కీ సెగ్మెంట్..!
లోక్సభ ఎన్నికల వేళ న్యూఢిల్లీ సెగ్మెంట్ పేరు మరోసారి మార్మోగుతోంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో.. అదే పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ నియోజకవర్గం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. 1992 ఉప ఎన్నికలు మొదలు ఇప్పటివరకు న్యూఢిల్లీ స్థానంలో ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందో.. అదే పార్టీ కేంద్రంలో కొలువుదీరుతోంది.
ఇక్కడ మొదటిసారిగా లోక్సభ ఎన్నికలు 1951లో జరిగాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసినట్లయితే.. 16 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు ఇక్కడ గెలిచిన అభ్యర్థికి సంబంధించిన పార్టీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1992 ఉప ఎన్నికల తర్వాత మాత్రం ఇక్కడ విజయం సాధించినోళ్ల పార్టీయే కంటిన్యూయస్ గా అధికారంలోకి వస్తోంది.
రాజకీయాల్లో అంతే : అప్పుడు విడిపోయిన దంపతులు.. ఇప్పుడు కలిపిన ఎంపీటీసీ ఎన్నికలు
మీనాక్షి లేఖి వర్సెస్ అజయ్ మాకెన్
2014 నాటి లోక్సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ న్యాయవాది మీనాక్షి లేఖి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో అదే పార్టీ అధికారంలోకి వస్తోందనే సెంటిమెంట్ మరోసారి నిజమైంది. అప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వాన బంపర్ మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టింది.
2009, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ విజయం సాధించడంతో.. ఆ రెండు సార్లు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సెంట్రల్ లో కొలువుదీరింది. 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్మోహన్ విజయంతో వాజ్పేయి నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక్కడ చిత్రమేంటంటే.. 1996లో పార్లమెంటులో మెజార్టీ లేక వాజ్పేయి గవర్నమెంట్ 13 రోజులకే పడిపోయింది. అప్పటి ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా జగ్మోహన్ గెలుపొందడం గమనార్హం.
గెలిచి రాజీనామా చేస్తే.. ప్రభుత్వం పాయే..!
1991 - 92 ప్రాంతంలో చిత్రవిచిత్ర సంఘటన జరిగింది. 1991 లోక్సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ తో పాటు గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి బీజేపీ సీనియర్ లీడర్ ఎల్కే అద్వానీ పోటీచేశారు. ఆ రెండు చోట్ల విజయం సాధించడంతో.. న్యూఢిల్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో న్యూఢిల్లీ సెగ్మెంట్ లో శత్రుఘ్న సిన్హా బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేశ్ కన్నా పోటీ చేసి విజయం సాధించారు.
అయితే ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా.. తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 1951 నుంచి 1989 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఆరుసార్లు మాత్రమే న్యూఢిల్లీ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటే కేంద్రంలో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 1992 ఉప ఎన్నికల నుంచి ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది ఆ స్థానమే కావడం విశేషం.
కీలకం.. ప్రత్యేకం
కేంద్ర ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తున్న న్యూఢిల్లీ సెగ్మెంట్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని కీలక వ్యవస్థలన్నీ కూడా ఇదే నియోజకవర్గం పరిధిలో ఉండటం విశేషం. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన అనేక శాఖల కార్యాలయాలు, రాజ్యాంగ బద్ధమైన కేంద్రీయ సంస్థలు, పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి అధికారిక నివాసం, కేంద్రమంత్రుల క్వార్టర్స్.. ఇలా దేశ వ్యవస్థలో కీలకమైన శాఖలు, సంస్థలు ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్నాయి.
హీరో కావాలనుకున్నాడు.. డ్రగ్స్ స్మగ్లరయ్యాడు.. అసలేం జరిగింది?
ఈసారి ఎవరిదో పీఠం..!
ఆరో విడత పోలింగ్ లో భాగంగా ఢిల్లీలోని ఏడు సెగ్మెంట్లకు మే 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖి, కాంగ్రెస్ నుంచి ఇక్కడి మాజీ ఎంపీ అజయ్ మాకెన్, ఆమ్ అద్మీ పార్టీ నుంచి బ్రిజేష్ గోయల్ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు మహామహులు ఇక్కడి నుంచి బరిలోకి దిగడంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి గతంలో అజయ్ మాకెన్ ఈ స్థానం నుంచి గెలవడంతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖి కూడా 2014లో గెలవడంతో బీజేపీ బంపర్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. అప్పటి ఎన్నికల్లో ఢిల్లీలోని 7 స్థానాలను క్లీన్ స్వీప్ చేశారు కమలనాథులు.