వాడిని వదలొద్దు: నిర్భయ తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులో అరెస్టు అయిన బాలనేరస్తుడిని విడిచి పెట్టరాదని, అతని వల్ల సమాజానికి ముప్పు ఉందని నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర మానవ హక్కుల సంఘాన్ని( ఎన్ హెచ్ ఆర్సీ)ని ఆశ్రయించారు.
తమ కుమార్తె మీద జరిగిన అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన అతనిని బయటకు వదిలితే సమాజానికి ముప్పు పొంచిఉందని నిర్భయ తల్లిదండ్రులు అంటున్నారు. ఆ విషయంపై నిర్భయ కుటుంబ సభ్యులు ఎన్ హెచ్ ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు.
నిర్భయ కేసులో దోషిగా తేలిన బాల నేరస్తుడిని జైలు నుంచి విడుదల కాకుండా చూడాలని వారు పిటిషన్ లో మనవి చేశారు. అతను విడుదలైతే సమాజంలోని సామాన్య ప్రజలకు, స్వేచ్చకు చాల ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జైలు నుంచి విడుదల అయిన తరువాత మళ్లీ మళ్లీ నేరాలు చేసే ప్రవృత్తి అతనిలో అధిక స్థాయిలో ఉందని నిర్భయ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఎన్ హెచ్ ఆర్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
దీనిపై రెండు వారల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్ హెచ్ ఆర్సీని ఆశ్రయించక ముందు నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. నిర్భయ కేసులో అరెస్టు అయిన బాల నేరస్తుడు డిసెంబర్ 15 విడుదల కానున్నాడు.