జీఎస్టీ బకాయిల కోసం ఎదురు చూపు: ముఖ్యమంత్రి ఢిల్లీ బాట..నిర్మలతో భేటీ..!
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిల కోసం మరో ముఖ్యమంత్రి ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ఋతో భేటీ అయ్యారు. జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఙప్తి చేశారు. ఆయనే- వీ నారాయణ స్వామి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి. ఇదివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా జీఎస్టీ బకాయిల కోసం ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. నిర్మలా సీతారామన్కు ఆయన బహిరంగ లేఖ రాసి, తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా- నారాయణ స్వామి మంగళవారం న్యూఢిల్లీలో నిర్మలా సీతారామన్ను కలిశారు. తమకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జీఎస్టీ నిధులను కేంద్రం తొక్కి పెట్టిందని, ఫలితంగా- తాము అభివృద్ధి, సంక్షేమ పథకాలను అనుకున్నంత వేగంగా కొనసాగించలేకపోతున్నామని వివరించారు.
సుమారు ఆరు వేల కోట్ల రూపాయల మేరకు జీఎస్టీ బకాయిలు విడుదల కావాల్సి ఉందని నారాయణ స్వామి కేంద్రమంత్రికి వివరించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటోన్న తమకు పర్యాటకం, మత్స్య సంపద రంగాల నుంచి ఆదాయం అందుతోందని, కొద్ది రోజులుగా ఈ రెండు రంగాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం రావట్లేదని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితులు అభివృద్ధి పనులను కొనసాగించడం కష్టతరమౌతోందని అన్నారు.
దీనిపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా జీఎస్టీ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిదుడుకుల వల్ల కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు మంజూరు చేయాల్సిన నిధుల్లో కోత పెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడం, ఆటోమొబైల్ వంటి కీలక రంగాల్లో నెలకొన్న మందగమనం ప్రభావం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోందంటూ బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు.