త్వరలో రూ.20,రూ.50 కొత్త నోట్లు!..: అర్జున్ రామ్ మేఘ్వాల్
రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన తరహాలోనే ఇప్పుడున్న రూ.20, రూ.50 స్థానంలో కొత్త నోట్లను ప్రవేశ పెడతామని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: గత నవంబర్ 8వ తేదీన దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టినా.. నేటికి కరెన్సీ కష్టాలు తీరనే లేదు. ఇదిలా ఉంటే, త్వరలోనే ఇప్పుడున్న చిన్న నోట్ల స్థానంలో కొత్త నోట్లను తీసుకోవచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన తరహాలోనే ఇప్పుడున్న రూ.20, రూ.50 స్థానంలో కొత్త నోట్లను ప్రవేశ పెడతామని పేర్కొన్నారు.
కరెన్సీ కష్టాలను సాధ్యమైనంత మేర అధిగమించడానికి వీలైనంత ఎక్కువ మొత్తంలో వినియోగదారులకు నగదు పంపిణీ చేయాలని ఆర్బీఐ సహా బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. నోట్ల రద్దుపై చాలా దేశాలు సానుకూలంగా స్పందిస్తున్నాయన్నారు.
నోట్ల రద్దు ద్వారా ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతతో పాటు ఎఫ్డీఐలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయని అర్జున్ రామ్ మేఘ్వాల్ అభిప్రాయపడ్డారు.