కొత్త విద్యా విధానంతో ఆత్మనిర్భర్ -స్వేచ్ఛ కోసమే రవీంద్రుడి ‘విశ్వ భారతి’ -వర్సిటీ స్నాతకోత్సవంలో మోదీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతనంగా రూపొందించిన జాతీయ విద్యా విధానంతో భారత్ విశ్వగురు స్థానం మరింత పదిలం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ విశ్వగురు వైపు ప్రయాణించడానికి ఈ విద్యా విధానం దోహదపడుతుందని చెప్పారు. కోల్ కతాలో నెలవైన విశ్వ భారతి యూనివర్శిటీ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ప్రసంగం చేశారు.
దేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించి తాము తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఒక విప్లవం లాంటిదని, గేమ్ ఛేంజర్ గానూ దానిని భావించొచ్చని ప్రధాని మోదీ అన్నారు. నూతన విద్యావిధానం దేశాన్ని ఆత్మనిర్భర భారత్ వైపు తీసుకెళ్తుందని, కొత్త కొత్త ఆవిష్కరణలకు, ప్రయోగాలకు కూడా దోహదపడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని అతి కీలకమైన ప్రస్తావన చేశారు..
మేధస్సులో సకారాత్మక, నకారత్మక రెండు ఆలోచనలూ ఉంటాయని, రెంటికీ తగ్గ దారులూ ఉంటాయని, అయితే ఏ వైపుగా వెళితే సమస్య తీరిపోతుందన్న దానిపై మాత్రం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని, హింసను ప్రేరేపించేవారంతా బాగా చదువుకున్న వారేనని, బాగా నైపుణ్యం కలవారని గుర్తుచేశారు. మరోవైపు కోవిడ్ విలయం నుంచి ప్రజల్ని కాపాడేందుకు అహోరాత్రాలు శ్రమిస్తున్నవారూ ఉన్నారని, ఏ బాటలో నడవాలన్నది విద్యార్థులే నిర్ణయించుకోవాలన్నారు. ఇదంతా సైద్ధాంతిక భూమిక ఎంత మాత్రమూ కాదని, అది ఆలోచనా విధానమని మోదీ వివరించారు. ఇక,
పశ్చిమ బెంగాల్ వేదికగా విశ్వ భారతి విశ్వవిద్యాలయంలో విద్యా వ్యవస్థను గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సమున్నత లక్ష్యంతో అభివృద్ధి చేశారని ప్రధాని మోదీ చెప్పారు. ఎవరికైనా లోబడి ఉండాలనే సంకెళ్ళ నుంచి భారత దేశ విద్యా వ్యవస్థకు విముక్తి కల్పించడం, ఆధునికీకరించడం లక్ష్యంగా రవీంద్రుడు విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారని, విశ్వ శాంతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు.