కశ్మీర్లో నవయుగానికి నాంది పడింది.. అంబేద్కర్, శ్యాంప్రసాద్ ఆశయాలు నెరవేర్చామన్న మోడీ
Recommended Video
న్యూఢిల్లీ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేయడంతో కశ్మీర్ ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ విభజనతో ఆ రాష్ట్రానికి నవయుగం ప్రారంభమైందన్నారు. కశ్మీర్ ప్రజలకు కూడా దేశంలోని ఇతర పౌరులతో సమానంగా హక్కులు వర్తిస్తాయని పేర్కొన్నారు.
న్యాయం జరగలేదు
ఆర్టికల్ 370 రద్దు చేసేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఆర్టికల్ 370తో ఒక్కరికీ న్యాయం జరగలేదు. అవినీతి, కుటుంబపాలన రాజ్యమేలిందని విమర్శించారు. కశ్మీర్లో 45 వేల మంది అమాయకులు చనిపోయారని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ విభజన అనేది చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. దీంతో కశ్మీర్ వేగంగా అభివృద్ది చెందుతుందని అభిప్రాయపడ్డారు. జమ్ము కశ్మీర్ విభజనతో కశ్మీరీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అంతేకాదు అక్కడి ప్రజలకు దినసరి కనీస వేతంన అందిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ఒకటిన్నర యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వెల్లడించారు. ఎట్టకేలకు జమ్ము, కశ్మీర్ ప్రజలకు న్యాయం జరిగిందన్నారు ప్రధాని మోడీ. ఇక నుంచి కశ్మీర్లో వ్యాపారం మరింత మెరుగవుతుందన్నారు. ఇన్నాళ్లు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయన్నారు. జమ్ము కశ్మీర్ ప్రజలకు ప్రధానమంత్రి స్కాలర్ షిప్ కూడా అందిస్తామని పేర్కొన్నారు మోడీ.
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
జమ్ము కశ్మీర్ విభజన చేసే సమయంలో చాలా ఆలోచించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజల మేలు కోసమే నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ప్రయోజనాలు కశ్మీర్ ఉద్యోగులకు వర్తిస్తాయని స్పష్టంచేశారు. కశ్మీర్ ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. దీంతోపాటు పర్యాటక రంగం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
కశ్మీర్ విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. కశ్మీర్ విభజన బిల్లును లోక్ సభలో కూడా డివిజన్ పద్ధతిలో లెక్కించారు. బిల్లుకు అనుకూలంగా 367 మంది సభ్యులు మద్దతు తెలిపారు.
వ్యతిరేకంగా 67 మంది సభ్యులు ఓటేశారు. దీంతో కశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. కశ్మీర్ విభజన బిల్లును మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదింపజేయాలని నిన్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు భావించగా .. డివిజన్ పద్ధతిలో ఓటింగుకు సభ్యులు పట్టుబట్టారు. మధ్యలో కొద్దిసేపు సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో స్లిప్పుల ద్వారా ఓట్లను లెక్కించారు. బిల్లు ఆమోదం పొందే సమయంలో సభలో 191 మంది సభ్యులు ఉన్నారు. కశ్మీర్ విభజన బిల్లుకు 125 మంది మద్దతు తెలిపారు. ఎన్డీఏ సహా మిత్రపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. అయితే సభలో ఉన్న మరో సభ్యుడు ఎవరికీ ఓటేయక .. తటస్థంగా ఉండిపోయారు.