మళ్ళీ పెరుగుతున్న కేసులతో భారత్ కు కొత్త భయం..తాజాగా 54,069 కేసులు, 1,321 మరణాలు
భారతదేశంలో కరోనా కేసులు తగ్గినట్టే కనిపించినా, మళ్ళీ క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇటీవల 50 వేలకు తక్కువగా నమోదైన కేసులు, తాజాగా 50 వేలకు పైగా నమోదవుతున్న తీరు, మరోపక్క డెల్టా ప్లస్ వైరస్ భయం భారత దేశ ప్రజలను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఇక తాజాగా కరోనా వైరస్ (కోవిడ్ -19) కారణంగా భారతదేశం గురువారం 54,069 కేసులు, 1,321 మరణాలను నమోదు చేసింది.
మూడు కోట్లకు పైగా కోవిడ్ కేసులతో భారత్
ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778గా ఉంది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 3, 91,981 కు చేరుకుంది. ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 68,885 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 29,063,740 కు చేరుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోజువారీ రికవరీలు వరుసగా 42 వ రోజు కూడా కొత్త ఇన్ఫెక్షన్ల కంటే ఎక్కువగా ఉన్నాయి.
6 లక్షలకు చేరుకున్న క్రియాశీల కేసులు
క్రియాశీల కేసులు 6,27,057 కి తగ్గాయి . ఇది మొత్తం కరోనా కేసుల సంఖ్యలో 2.14 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కోవిడ్ -19 కోసం 18,59,469 నమూనాలను పరీక్షించారు.ఇప్పటి వరకు మొత్తం దేశవ్యాప్తంగా చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలు 39,78,32,667 కు చేరుకున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గురువారం తెలిపింది.50,848 కేసులు నమోదైన బుధవారం కంటే గురువారం కేసుల సంఖ్య 3,221 ఎక్కువ కావడం కాస్త ఆందోళన కలిగిస్తుంది.
తగ్గిన మరణాలు గత 24 గంటల్లో 1321 మరణాలు
అయితే, గురువారం మరణాలు 1321 మాత్రమే నమోదయ్యాయి. బుధవారం రోజు 1,358 మంది కరోనా మహమ్మారి బారినపడి మరణించారు. అంటే ఈరోజు కంటే నిన్న నమోదైన మరణాలు 37 ఎక్కువ. భారతదేశంలో రోజువారీ కేసులు మరియు మరణాలు ఇంకా నమోదవుతున్న పరిస్థితులలో, డెల్టా ప్లస్ వేరియంట్ యొక్క ఆందోళన ఇప్పుడు దేశానికి కొత్త సమస్యగా మారింది. దీనిని 'AY.1' వేరియంట్ లేదా B.1.617.2.1 అని కూడా పిలుస్తారు.
భారత్ కు డెల్టా ప్లస్ వేరియంట్ భయం
భారతదేశంలో ఇప్పటివరకు వేరియంట్ యొక్క నలభై కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ మరియు మధ్యప్రదేశ్లలో ఈ వేరియంట్ గుర్తించామని అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఇవి కాకుండా, జమ్మూ కాశ్మీర్ మరియు దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక మరియు తమిళనాడులలో కూడా AY.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అలెర్ట్ గా ఉండాలని వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది.
గత 24 గంటల్లో దాదాపు 6.5 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్
కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించి మొత్తం 30,16,26,028 మందికి టీకాలు వేయించగా, అందులో 24,82,24,925 మందికి మొదటి మోతాదు లభించిందని, మిగిలిన 5,34,01,103 మందికి రెండు మోతాదులు వచ్చాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం టీకాలలో, గత 24 గంటల్లో దాదాపు 6.5 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయింది.