కాంగ్రెస్లో కొత్త ఫార్ములా: సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి హస్తం పార్టీలో సమూలు మార్పులు జరుగుతున్నాయి. కాంగ్రెస్కు సంబంధించి ఏర్పాటు చేసిన పలు కమిటీల్లో యువతకే పెద్ద పీట వేశారు రాహుల్ గాంధీ. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కూడా ఈ సారి కొత్తగా ఉండనుంది. డిసెంబర్లో జరగనున్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో అభ్యర్థులను కొత్త పద్ధతిలో ఎంపిక చేయనున్నారు రాహుల్ గాంధీ. ఇప్పటికే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను తీసుకుని స్క్రీనింగ్ కమిటీలు అభ్యర్థుల నియోజకవర్గాల్లో పర్యటించి ఏ అభ్యర్థికి ప్రజల మద్దతు ఉందో ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుని ఆ తర్వాత అభ్యర్థి పేరును తుది జాబితాలో చేర్చనుంది.
ఇప్పటి వరకు ఒక అభ్యర్థిని గుడ్డిగా సెలెక్ట్ చేసేవారు. ఇక ఆ పరిస్థితి కాంగ్రెస్లో కనిపించదు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర నేతలను ఒక్కో నియోజకవర్గం నుంచి 3-5 మంది పేర్లను ఎంపిక చేయాలని వారిలో ఒక్కరిని తాము సెలెక్ట్ చేస్తామని స్క్రీనింగ్ కమిటీలు తెలిపాయి. ఇలాంటి కమిటి ఒకటీ రాష్ట్ర నియోజకవర్గాల్లో పర్యటించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న దాఖలాలు మునుపెన్నడూ లేదు.
ఇలాంటి ఒక ప్రయోగం మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం ముందుగా ప్రారంభించింది. టికెట్ కోసం అభ్యర్థులు ఢిల్లీకి వెళ్లి, అక్కడే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో క్యాంప్ వేసి టికెట్ కోసం లాబీయింగ్ చేసేదాని కంటే రాష్ట్రాల్లో స్క్రీనింగ్ కమిటీలు పర్యటించి అభ్యర్థులను ఖరారు చేయడం బాగుంటుందని ఛత్తీస్గడ్ కాంగ్రెస్ విభాగం భావించింది. ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులపై సర్వేలు నిర్వహిస్తున్నాయి.
ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీలు బూత్ లెవెల్ కమిటీలు, బ్లాక్ లెవెల్ కమిటీలు, జిల్లా కమిటీలతో భేటీ అయి అభ్యర్థుల జాబితాను తయారు చేశాయి. ఇక ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించి తమ సొంత సూచనలు చేయనున్నాయి. ఆ తర్వాత మిగతా అభ్యర్థులతో పోల్చి పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు.
రాజస్తాన్ స్క్రీనింగ్ కమిటీకి కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా నేతృత్వం వహిస్తుండగా... సభ్యులుగా లలితేష్ త్రిపాఠీ, శంకిర్ సనాది ఉన్నారు. మధ్య ప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ నేత మధుసూధన్ మిస్త్రీ నేతృత్వం వహిస్తుండగా... సభ్యులుగా నేత డిసౌజా, అజయ్ కుమార్ లల్లూ ఉన్నారు. ఛత్తీస్ఘడ్లో మాజీ అస్సోం పీసీసీ ఛీఫ్ భువనేశ్వర్ కలితా నేతృత్వం వహిస్తుండగా రోహిత్ చౌదరి, అశ్విన్భాయ్ కొత్వాల్ సభ్యులుగా ఉన్నారు.