యూపీలో కొత్త పరేషాన్ .. కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటి వరకు 2,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.50 మంది మరణించారు . ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనా కట్టడికి యూపీ సీఎం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినా కరోనా మాత్రం విస్తరిస్తూనే ఉంది. ఇక అత్యధికంగా ఆగ్రాలో 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
కరోనా ఎఫెక్ట్ .. ఇప్పుడు ప్రేగుల మీద కూడా.. నెదర్ల్యాండ్ శాస్త్రవేత్తల రీసెర్చ్
కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో తగు జాగ్రతలు తీసుకుంటున్నా నిత్యావసరాలు , కూరగాయలు అమ్మే వారికి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం . ఇక అక్కడ కూడా సామాజిక దూరం పాటించాలని చెప్పినా సరే నిత్యావసరాలకు , కూరగాయలకు ఎగబడిన జనం దెబ్బకు కూరగాయల వ్యాపారులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇక దీంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. వీరి దగ్గరి నుంచి ఎవరెవరు కూరగాయలు కొన్నారు? వారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు ఎవరు అన్న విషయాలు చేధించడం పోలీసులకు సవాలుగా మారింది.
ఆగ్రాలో 10 రోజుల్లోనే 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా
ఇక తాజా పరిణామాల నేపధ్యంలో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గడిచిన 10 రోజుల్లోనే 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీరిలో ఎక్కువమంది బాసాయి, తాజ్గంజ్ మండీల్లో కూరగాయలు విక్రయించేవారని అధికారులు పేర్కొన్నారు . ఇప్పటికే ఆగ్రాలో కూరగాయల వ్యాపారులకు కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా మిగతా వీధి వ్యాపారులు, కిరాణా వ్యాపారులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
160 మంది వ్యాపారులకు కరోనా నిర్ధారణ పరీక్షలు
ఇక ఆగ్రాలోఅత్యధికంగా కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ రావటంతో అసలు వీరికి కరోనా ఎలా వచ్చింది అన్న దాని మీద దృష్టి పెట్టారు అధికారులు . ఇక వీరి వద్ద నుండి కూరగాయలు కొన్న వారిని కూడా గుర్తించి క్వారంటైన్ చేసే పనిలో ఉన్నారు. వీరికి వైరస్ ఎలా సోకిందనే విషయం ఇంకా తెలియక ఆందోళన చెందుతున్నారు అధికారులు . ఇప్పటికే 160 మంది కూరగాయల వ్యాపారులు, వీధి వ్యాపారులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ పరీక్షల్లో 28 మందికి కరోనా సోకినట్లు తేలింది.
మీరట్లో 24, ఆగ్రాలో 28, లక్నోలో 4 కేసులు
మీరట్లో 24, ఆగ్రాలో 28, లక్నోలో 4 కేసులు నమోదు అయ్యాయి. కూరగాయల వ్యాపారులు కరోనా బారిన పడ్డారు . గత 24 గంటల్లో, నవీన్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ కరోనా వైరస్ కు హాట్స్పాట్గా మారింది ఇక 24 మంది కూరగాయల వ్యాపారులు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు . గత రెండు రోజులుగా సీలు వేసిన మీరట్లోని మార్కెట్, చిల్లర వ్యాపారులు మరియు చిన్న దుకాణ యజమానులకు కూరగాయలను సరఫరా చేస్తుంది. ఇక ఈ నేపధ్యంలో వైద్యులు, అలాగే అధికారులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు .
కూరగాయలు ప్యాక్ చేసిన కవర్లలో డోర్ డెలివరీ
దీంతో కూరగాయలు నిత్యావసరం కాబట్టి కరోనా నివారణ నిమిత్తం ఇంటింటికీ కూరగాయలు ప్యాక్ చేసిన కవర్లలో డోర్ డెలివరీ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు . ఇప్పటికే 20 వార్డుల్లో ఇంటింటికీ కూరగాయలు పంపిణీ చేస్తున్నామని, త్వరలోనే 100 వార్డుల్లో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆగ్రా మండీ సెక్రటరీ శివకుమార్ పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించేలా అన్ని పండ్ల దుకాణాలు, ఇతర వీధి మార్కెట్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంకా చాప కింద నీరులా యూపీలో కరోనా విస్తరణ జరుగుతుందని తాజా పరిణామాల నేపధ్యంలో అర్ధం అవుతుంది.