ఐబీ, రా, సైన్యాధిపతుల నియామకం: వీరే
భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ను కేంద్ర ప్రభుత్వం శనివారం నియమించింది.
న్యూఢిల్లీ: భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ను కేంద్ర ప్రభుత్వం శనివారం నియమించింది. వైమానిక దళం ఉపఅధిపతి ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా భారత వైమానిక దళాధిపతిగా నియమితులయ్యారు. కొత్త సైన్యాధిపతిగా రావత్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, నియామకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వస్తుందని రక్షణశాఖ ఓ ట్వీట్లో వెల్లడించింది.
సైనిక దళం ఉప అధిపతిగా పని చేస్తున్న రావత్కు.. ఆయనకన్నా ముందున్న ఇద్దరు సీనియర్లను కాదని అత్యున్నత పదవి దక్కింది. తూర్పు కమాండ్ సారథి లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్బక్షి, దక్షిణ కమాండ్ సారథి పీఎం హరిజ్లను తోసిరాజని రావత్ను నియమించారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలోనూ, సైన్యం పునర్ వ్యవస్థీకరణ, పునఃనిర్మాణం, ఉగ్రవాదం, పరోక్ష యుద్ధం, ఈశాన్యభారతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విషయంలో రావత్ సరైన వ్యక్తిగా కేంద్రం భావించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
గత మూడు దశాబ్దాల కాలంలో భారత సైన్యంలో పోరాట క్షేత్రాల్లో సేవలు అందించిన అనుభవం రావత్కు ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్తో నియంత్రణ రేఖ, చైనాతో వాస్తవాధీన రేఖల వెంబడి, ఈశాన్య రాష్ట్రాల్లో పోరు బాధ్యతల్ని నిర్వర్తించారు. మిగతా ఇద్దరికీ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేసిన అనుభవం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, కొత్త వైమానిక దళాధిపతిగా నియమితులైన ఎయిర్మార్షల్ బీఎస్ ధనోవా డిసెంబరు 31న బాధ్యతలు చేపడతారని రక్షణశాఖ పేర్కొంది. ఈయనకు పర్వతప్రాంత యుద్ధక్షేత్రాలు, ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో విస్తృత అనుభవం ఉంది.
రా అధిపతిగా అనిల్
గూఢచర్య సంస్థ రీసెర్చి, అనాలిసిస్ వింగ్(రా)కు అధిపతిగా అనిల్ ధస్మన నియమితులయ్యారు. ఈయన మధ్యప్రదేశ్ క్యాడర్ అధికారి. 23 ఏళ్లుగా రా సంస్థలో పనిచేస్తున్న అనిల్ పాకిస్థాన్సహా ముఖ్యమైన డెస్కులకు సేవలందించారు.
ఐబీ కొత్త సారథిగా రాజీవ్జైన్
కేంద్ర నిఘాసంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కొత్త అధిపతిగా రాజీవ్ జైన్ను నియమించారు. జార్ఖండ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ ప్రస్తుతం ఐబీలో ప్రత్యేక సంచాలకుడిగా పనిచేస్తున్నారు. జనవరి 1న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సారథి దినేశ్వర్ శర్మ పదవీ కాలం డిసెంబర్ నెలాఖరుతో ముగియనుంది.