మీనాక్షి లేఖి టికెట్ కట్: లోక్ సభ బరిలో బీజేపీ అభ్యర్థిగా టీమిండియా మాజీ ఓపెనర్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున బరిలో నిల్చోబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్ సభ స్థానాల్లో ఒకటైన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ లోక్ సభ స్థానంపై బీజేపీ జెండా ఎగురుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన మీనాక్షి లేఖి గెలుపొందారు. ఈ సారి అక్కడ అభ్యర్థిని మార్చుతారని, ఆమె స్థానంలో గౌతమ్ గంభీర్ ను ఎన్నికల రేసులో నిల్చోబెడతామని బీజేపీ సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు.
క్రికెట్ అన్ని ఫార్మట్ల నుంచీ రిటైర్ అవుతున్నట్లు గౌతీ.. గత ఏడాది డిసెంబర్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. క్రికెట్ కు దూరమైన తరువాత గౌతమ్ గంభీర్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఉగ్రవాదులు, మావోయిస్టుల దాడుల్లో అమర వీరులైన జవాన్లు, పోలీసుల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా ఓ ఫౌండేషన్ ను నెలకొల్పారు.
సమకాలీన అంశాలపైనా ఆయనకు మంచి అవగాహన ఉంది. రాజకీయాలపైనా తరచూ వివిధ పార్టీలకు చెందిన నాయకులకు చురకలు అంటిస్తూ ట్వీట్లు సంధిస్తుంటారు. గౌతమ్ గంభీర్ అభిప్రాయాలు తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయని, ఆయనను త్వరలోనే పార్టీలోకి తీసుకుంటామని బీజేపీ ఢిల్లీశాఖ నాయకులు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల టికెట్ ఇస్తామని అన్నారు. దీనిపై ఇప్పటికే గౌతమ్ గంభీర్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు వెల్లడించారు.
బీజేపీతో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన క్రికెటర్ల జాబితా పెద్దదే..
బీజేపీలో చేరి తమ రాజకీయ జీవితాన్ని ఆరంభించిన క్రికెటర్ల జాబితా పెద్దదే. ఇదివరకు మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బీజేపీలో చాలాకాలం పాటు కొనసాగారు. ఇటీవలే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ కు దూరమైన మరో ఆటగాడు శ్రీశాంత్ కూడా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. కేరళకు చెందిన శ్రీశాంత్ 2016లో ఈ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. తిరువనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీశాంత్ ఓడిపోయారు. సిక్సర్ల సిద్ధుగా పేరున్న నవజ్యోత్ సింగ్ సిద్ధు కూడా బీజేపీతోనే తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, విజయం సాధించారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు.