పుల్వామా దాడి, వెలుగులోకి సంచలన విషయాలు: దాడి వ్యూహకర్త ఐఎస్ఐ చీఫ్?
కరాచీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో నాలుగు రోజుల క్రితం చోటు చేసుకున్న తీవ్రవాద దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్తాన్కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్ కనుసన్నుల్లోనే ఈ దాడి జరిగిందని అంటున్నారు. గతంలో పాక్ సైనిక కమాండర్గా పని చేశాడు. అతనికి కాశ్మీర్ భౌగోళిక అంశాలు తెలుసు.
ఇద్దరు కలిసి ప్లాన్
ఆసిమ్ మునీర్ గత ఏడాది అక్టోబర్ నెలలో ఐఎస్ఐ చీఫ్ అయ్యాడు. భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు, కార్యకలాపాలకు ఐఎస్ఐ ఊతమిస్తుంది. భారత్లో ఉగ్రవాద దాడి జరిపేందుకు ఆసిమ్ మునీర్ కుట్ర చేస్తున్న సమయంలో జైష్ ఎ మొహమ్మద్ కూడా అదేవిధమైన ప్లాన్ వేసింది. దీంతో ఇరువురు కలిసి పుల్వామా దాడికి వ్యూహం రచించారని తెలుస్తోంది. ఈ నెల మొదటి వారంలోనే ఈ దాడి చేయాలని కుట్ర చేశారని తెలుస్తోంది. కానీ పరిస్థితులు అనుకూలించలేదని తెలుస్తోంది.
పుల్వామా అటాక్: అందుకు ప్రతీకారంగా... పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రి నుంచి అజహర్ ఆదేశాలు
సాయం చేసిన ఐఎస్ఐ చీఫ్
జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాది అదిల్కు కారును, ఆర్డీఎక్స్ను స్థానిక స్లీపర్సెల్స్ సాయంతో ఐఎస్ఐ అందించినట్లుగా తెలుస్తోంది. మునీర్ కాశ్మీర్ సరిహద్దుల్లో చాలాకాలం పాటు విధులు నిర్వర్తించాడు. దీంతో కాశ్మీర్ పైన అతనికి పూర్తి అవగాహన ఉంది. జైష్ ఏ మొహమ్మద్కు మునీర్ అన్ని రకాలుగా సాయం చేసినట్లుగా తెలుస్తోంది. సైన్యాధికారి మెప్పు పొందేందుకు అతను ఆ దాడికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
పెరిగిన ఉగ్రకార్యకలాపాలు
ఇమ్రాన్ ఖాన్ సైన్యం మద్దతుతో అధికారంలోకి వచ్చాడు. అతను అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదం మరింత పుంజుకుందనే వాదనలు ఉన్నాయి. ఉగ్రవాదులపై, జీహాదీలపై చర్యలు చేపట్టడం లేదని అంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీలోని కొందరు నేతలు కూడా గత ఎన్నికల్లో ఉగ్రవాదుల మద్దతుతో గెలిచారనే వాదనలు ఉన్నాయి.