విప్రో: మే 1 నుంచి హోల్ టైమ్ డైరెక్టర్గా ప్రేమ్జీ వారసుడు రిషద్
బెంగుళూరు: అజీమ్ ప్రేమ్జీ పెద్దు కుమారుడు రిషద్ ప్రేమ్జీని విప్రో టెక్నాలజీస్ బోర్డు హోల్టైమ్ డైరెక్టర్గా నిమయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఐటీ సర్వీసుల రంగంలో విప్రో మూడో స్ధానంలో ఉంది.
రిషద్ ప్రేమ్జీ నాయకత్వాన్ని కొంత మంది స్వాగతిస్తే, విశ్లేషకులు మాత్రం విప్రోలో వారసత్వ ప్రణాళికకు ఇది దర్పణం అంటున్నారు. ఇక విప్రోలో అజీమ్ ప్రేమ్జీకి 74 శాతం వాటా ఉంది. 69 ఏళ్ల ప్రేమ్జీ 1,710 కోట్ల డాలర్ల సంపదతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో 48వ స్థానంలో ఉన్నారు.
ఆయనకు వారసుడుగా రిషద్ కంపెనీ పగ్గాలు చేపడతారని ఎంతో కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. వాటికి ఇప్పుడు తెర పడింది. గత కొంతకాలంగా కంపెనీ వ్యాపార వ్యూహాల రచనలోను ప్రత్యేకించి కొనుగోళ్లు, విలీనాల్లోను రిషద్ చాలా కాలంగా కీలక పాత్ర పోషిస్తున్నారు.
విప్రో అనుబంధ ఎఫ్ఎంసిజి, ఇన్ఫ్రా విభాగం విప్రో ఎంటర్ప్రైజెస్లో రిషద్ ఇప్పటికే డైరెక్టర్గా ఉన్నారు. అలాగే అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ బోర్డులో కూడా ఆయన డైరెక్టర్గా పని చేస్తున్నారు. విప్రో టెక్నాలజీస్ హోల్టైమ్ డైరెక్టర్గా ఆయన యథాప్రకారం ఇంతకు ముందు నిర్వహిస్తున్న బాధ్యతలే నిర్వహించనున్నారు.
రిషద్ 2007లో విప్రో టెక్నాలజీస్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్గా చేరారు. మూడేళ్ల కాలంలోనే చీఫ్ స్ర్టాటజీ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇన్వెస్టర్, ప్రభుత్వ వ్యవహారాల విభాగాలతో పాటు సీటీఓ బాధ్యతలు కూడా అప్పగించారు.
విప్రో చీఫ్ టికె కురియన్ రిషద్ నియామకంపై మాట్లాడుతూ హోల్టైమ్ డైరెక్టర్గా నియమించడం తప్పితే ఆయన నిర్వహిస్తున్న బాధ్యతల్లో ఎలాంటి మార్పు లేదని, దానిపై ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదని కురియెన్ అన్నారు.