భారత్లో కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్- ఇంకా లక్షకు పైగా యాక్టివ్ కేసులు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. తొలిదశలో హెల్త్ వర్కర్లకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో భారత్ కోటి మందికి పైగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసి ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాని పరిస్ధితుల్లో భారత్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.
ఇప్పటివరకూ ఒక కోటీ, లక్షా 88 వేల ఏడుగురికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది. రాబోయే రోజుల్లో దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తూనే ఇప్పటివరకూ 25 దేశాలకు భారత్ వ్యాక్సిన్ను ఎగుమతి కూడా చేసింది. ఐక్యరాజ్యసమితికి సైతం 2 లక్షల వ్యాక్సిన్ డోసులను ఉచితంగా పంపింది. త్వరలో మరో 49 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేస్తామని విదేశాంగశాఖ ప్రకటించింది.
మరోవైపు భారత్లో వ్యాక్సిన్ పంపిణీ చురుగ్గా సాగుతున్నా.. అన్ని వర్గాలకు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయినా ఇంకా ప్రస్తుతం దేశంలో లక్షా 39 వేల యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ భారత్లో మొత్తం కోటీ 9 లక్షల కేసులు నమోదు కాగా.. అందులో కోటీ 6 లక్షళ మంది చికిత్స తీసుకుని కోలుకున్నారు. లక్షా 56 వేల మంది చనిపోయారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఇంకా అధికంగా ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలను కూడా నియంత్రిస్తోంది.