కార్యాలయాలకు ఇవీ కొత్త నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గైడ్ లైన్స్ ఇవే..
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. పనిచేసే చోట తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొన్నది. ప్రతీ ఒక్క ఉద్యోగి తమకుతాము అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ మేరకు కొన్ని గైడ్ లైన్స్ను పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్ అండ్ పెన్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ ఒక నోట్ విడుదల చేసింది. అందులో పొందుపరిచిన జాగ్రత్తలను ఒకసారి పరిశీలిద్దాం.
1. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి వచ్చేందుకు అనుమతి. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ఆఫీసుకు రావొద్దని సూచించింది.
2. కంటైన్మెంట్ జోన్లలో ఉండే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని వెల్లడించింది. ఆ జోన్లో పరిస్థితి మెరుగుపడే వరకు రావొద్దని స్పష్టంచేసింది.
3. ప్రతీ రోజు కార్యాలయంలో 20 మందికి మించి రావొద్దని తేల్చిచెప్పింది. మిగిలిన సిబ్బంది విధిగా వర్క్ ఫ్రం హోం చేయాలని తెలిపింది.
4. సెక్రటరీ/డిప్యూటీ సెక్రటరీ స్థాయి కింద గల ఉద్యోగులు రోజు తప్పి రోజు ఆఫీసు రావాలని కోరింది.
5. ఒక సెక్షన్లో ఒకరే అధికారి ఉండాలని, అంతకన్నా ఎక్కువమంది ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దని సూచించింది.
6. ఆఫీసులో ఉన్న సమయంలో విధిగా ఫేస్ మాస్క్ ధరించాలి. ఒకవేళ మాస్క్ ధరించకుంటే సదరు ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది.
7. ఫేస్ మాస్క్, గ్లౌజ్ ధరించాక.. ప్రత్యేకమైన డస్ట్ బిన్లో వేయాలని కోరింది. నార్మల్ బిన్లో వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
8. ఫేస్ టు ఫేస్ మాట్లాడటం మానేయాలని... పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని కోరింది.
9. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయంలో ప్రత్యేక గదుల్లో సదుపాయం ఉంటే బెటర్ అని అభిప్రాయపడింది. జనరల్ సిబ్బందికి కూడా వీడియో కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయ్యే వెసులుబాటు కల్పించాలని కోరింది.
10. కార్యాలయంలో ఉన్న సిబ్బంది ప్రతీ అరగంటకు చేతులను పరిశుభ్రంగా కడుక్కొవాలని సూచించింది.
11. కార్యాలయంలో గల స్విచ్, తలుపులు, బటన్లు, వాష్ రూమ్ ప్రతీ అరగంటకు తప్పనిసరిగా సోడియం హైడ్రోక్లోరైడ్తో శుభ్రపరచాలని కోరింది.
12. కార్యాలయంలో ఉన్న సిబ్బంది మీటర్ దూరం పాటించాలని కోరింది. భౌతికదూరం నిబంధనను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
13. ఉద్యోగులతోపాటు సిబ్బంది తప్పకుండా నియమాలు పాటించాలని కోరింది. లేదంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.