రైల్వేమంత్రి తమ్ముడు స్టేషన్ మాస్టర్, ఆశించడంలేదని..
బెంగళూరు: రైల్వే శాఖ మంత్రి డివి సదానంద గౌడ సోదరుడు డివి సురేష్ గౌడ స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. నరేంద్ర మోడీ తన కేబినెట్లోకి సదానంద గౌడను తీసుకొని రైల్వే శాఖను అప్పగించారు. అయితే సదానందకు, ఆయన తమ్ముడు సురేష్ గౌడకు... ఇద్దరికీ రైల్వే శాఖతో సంబంధం ఉంది.
అన్న సదానంద రైల్వే శాఖ మంత్రి కాగా, తమ్ముడు సురేష్ ఓ స్టేషన్ మాస్టర్. కర్నాటకలోని మంగళూరుకు దగ్గరలో గల నందికూర్ రైల్వే స్టేషన్ మాస్టర్గా పని చేస్తున్నారు. తన అన్నయ్య, రైల్వే మంత్రి సదానంద గౌడ నుంచి తానేమీ ఆశించడం లేదన్నారు. కాకపోతే దక్షిణ కన్నడ ప్రాంతంలో రైల్వే నెట్ వర్క్ మెరుగుపరచాలని సురేష్ గౌడ కోరుతున్నారు.
తన అన్నయ్య సదానంద గౌడకు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కుతుందని భావించానని, కానీ రైల్వే శాఖ వస్తుందని అనుకోలేదన్నారు. తనకు మోడీ కేబినెట్లో చోటు దక్కుతుందని తన అన్నయ్య సదానంద చెప్పారని కానీ, ఏ పోర్ట్ ఫోలియో వస్తుందో చెప్పలేదన్నారు.
సదానంద గౌడ కర్నాటక ముఖ్యమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన నుండి తాను ఏమీ ఆశించలేదని చెప్పారు. అయితే కర్నాటక రాష్ట్రంలో రైల్వే సిస్టమ్ మెరుగు పర్చాలని, ప్రత్యేకంగా దక్షిణ కన్నడ ప్రాంతంలో మెరుగు పర్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా, సురేష్ గౌడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలు రాశాక.. 1985లో హుబ్లీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా అపాయింట్ అయ్యారు.