జియో ఆ ఫోన్ తీసుకొస్తే.. స్మార్ట్ ఫోన్ కంపెనీలకు చావుదెబ్బే..
ఇదే గనుక జరిగితే.. 'జియో సిమ్' దెబ్బతో మిగతా టెలికాం సంస్థలు ఎలా అయితే కుదేలయ్యాయో.. స్మార్ట్ ఫోన్ల రంగంలోని ఇతర కంపెనీలన్ని కుదేలవడం ఖాయం.
న్యూఢిల్లీ: టెలికాం సంస్థలను ఓ కుదుపు కుదిపేసిన జియో.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి సిద్దమవుతోంది. అత్యంత చౌక ధరలో రూ.1000కే 4జీ ఎల్టీటీ, వీవోఎల్టీఈ ఫీచర్లను సపోర్ట్ చేసే ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
ఇదే గనుక జరిగితే.. 'జియో సిమ్' దెబ్బతో మిగతా టెలికాం సంస్థలు ఎలా అయితే కుదేలయ్యాయో.. స్మార్ట్ ఫోన్ల రంగంలోని ఇతర కంపెనీలన్ని కుదేలవడం ఖాయం. ఇదే వ్యూహాంతో అతి చౌక ధరలో ఆధునిక ఫీచర్స్ ను సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి రిలయన్స్ జియో ప్రయత్నం చేస్తోంది.
ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి దాదాపుగా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయినట్టు సమాచారం. జియో అందిస్తున్న ఫ్రీ వాయిస్ కాల్స్ ను ఈ ఫోన్లలోను పొందవచ్చు. ఇవి గనుక మార్కెట్లోకి వస్తే.. ఇతర స్మార్ట్ ఫోన్లు కొనడానికి కస్టమర్స్ ఆసక్తి చూపించరని సైబర్ మీడియా రీసెర్చ్ అనలిస్ట్ ఫైజల్ కవూసా అభిప్రాయపడ్డారు.
జియో ఇన్ఫోకామ్ ప్రవేశపెట్టబోయే ఈ 4జీ ఫీచర్ ఫోన్లలో ముందు, వెనక కెమెరాలు ఉంటాయి. జియో చాట్, లైవ్ టీవీ, వీడియో ఆన్ డిమాండ్ తదితర యాప్స్ ఇందులో ఉంటాయి. జియో మనీ వాలెట్ సర్వీస్ కూడా ఇందులో ఉంటుంది. మొత్తంగా ఈ ఫోన్లతో స్మార్ట్ ఫోన్ రంగాన్ని జియో చావు దెబ్బ తీయడం ఖాయంగానే కనిపిస్తోంది.