మెడికోలకు కొత్త రూల్స్ .. జిల్లా ఆస్పత్రుల్లో శిక్షణ తప్పనిసరి .. రీజన్ ఇదే !!
మెడికల్ విద్యార్థుల విషయంలో కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్యవిద్య పీజీలో ఎండి, ఎంఎస్ చదివే వైద్య విద్యార్థులంతా ఇకపై రెండవ సంవత్సరం నుండి జిల్లా ఆసుపత్రులలో శిక్షణ తీసుకోవడం తప్పనిసరి అని గెజిట్ విడుదల చేసింది కేంద్ర సర్కార్ . తాజాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ సవరణ నిబంధనలు 2020 కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ సర్కార్ మరో కీలక అడుగు ..2050 కోట్ల నిధులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ సవరణ నిబంధనలు 2020 విడుదల చేసిన కేంద్రం
ఇప్పటిదాకా మెడికల్ పీజీ విద్యార్థులు టీచింగ్ ఆస్పత్రిలోనే శిక్షణ పొందే వారు. అయితే ఈ సవరణ నిబంధన ద్వారా మెడికల్ పీజీ విద్యార్థులు కచ్చితంగా జిల్లా ఆస్పత్రిలో శిక్షణ పొందాలి. దీనివల్ల జిల్లా ఆస్పత్రిలో స్పెషలిస్టు వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని, వైద్య సిబ్బంది కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో వ్యాధులపై అవగాహన రావడంతో పాటుగా, దీనివల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లా ఆస్పత్రుల్లో మెడికల్ పీజీ విద్యార్థులకు శిక్షణ తప్పనిసరి
వంద పడకలకు తక్కువకాకుండా ఉన్న జిల్లా ఆసుపత్రులలో మెడికల్ పీజీ విద్యార్థులకు శిక్షణ అందిస్తారు. ఈ సంవత్సరం పీజీలో చేరిన వారికి వచ్చే సంవత్సరం నుండి ఈ శిక్షణ అమలు కానుంది. ఇప్పటివరకు పీజీ విద్యార్థులు టీచింగ్ ఆసుపత్రులలో శిక్షణ పొందుతుండగా, అక్కడ జిల్లా ఆసుపత్రులతో పోల్చి చూస్తే, తక్కువమంది పేషెంట్స్ ఉన్నట్లుగా గుర్తించారు. అందుకే జిల్లా ఆసుపత్రులలో శిక్షణ ఇవ్వడం వారికి ఉపయోగపడటమే కాకుండా, ప్రభుత్వానికి కూడా డాక్టర్ల కొరత తగ్గించినట్లు అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
రొటేషన్ పద్దతిలో శిక్షణ .. జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం ..
తాజాగా మొదటిసారి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కార్ కొత్త నిబంధనల ప్రకారం 3 ,4, 5 సెమిస్టర్ లో ఉన్న పీజీ విద్యార్థులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో జిల్లా ఆసుపత్రులలో పని చేయాల్సి ఉంటుంది. ఇలా శిక్షణకు వెళ్లిన వారిని జిల్లా రెసిడెంట్లుగా పిలుస్తారు. కేంద్ర సర్కార్ ప్రారంభించిన ఈ ప్రోగ్రాంను జిల్లా రెసిడెన్సి ప్రోగ్రామ్ అంటారు. జిల్లాలలో క్షేత్రస్థాయిలో రోగులకు సేవలందించే కీలకమైన ఆసుపత్రులలో జిల్లా ఆస్పత్రులు గణనీయమైన పాత్రను పోషిస్తాయి.
Recommended Video
వైద్యుల కొరత తగ్గించేందుకు , క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలుసుకోవటానికి
మెడికల్ పీజీ విద్యార్థులు అక్కడ పని చేయడం వల్ల క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియడంతో పాటుగా, ప్రజల ఆరోగ్య పరిస్థితులపై, వివిధ రకాల వ్యాధులపై డాక్టర్లకు అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పనిచేసే వైద్యులతో పాటుగా వీరి సేవలు కూడా తోడైతే ప్రజలకు మెరుగైన సేవలు అందడమే కాకుండా, డాక్టర్ల కొరత కు చెక్ పడుతుంది. ప్రస్తుతం మన దేశంలో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉంది. దానిని అధిగమించటానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం బాగా ఉపయోగపడుతుంది .