సోషల్ మీడియాకు కేంద్రం కళ్లెం : అలాంటి పోస్టులు చేస్తే..అంతే: జనవరి 15 నాటికి మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దూకుడు కల్లెం పడబోతోంది. సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్న నెటిజన్లు, ట్విట్టరెట్టీలకు కేంద్ర ప్రభుత్వం మూకుతాడు వేయనుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతంగా సర్కులేట్ అవుతోన్న అవాంఛనీయ, అసాంఘిక, ప్రముఖుల ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులు, నకిలీ వార్తలను నియంత్రించడానికి సరి కొత్త మార్గదర్శకాలను రూపొందంచే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి మార్గ దర్శకాల రూపకల్పన పూర్తవుతుందని, ఆ వెంటనే వాటిని అమలు చేస్తామని మంగళవారం సుప్రీంకోర్టుకు నివేదించింది.
జనవరి 15 డెడ్ లైన్..
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను అదుపు చేయడానికి ఉద్దేశించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ స్థాయిలో ఉంది. జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం దీన్ని విచారిస్తోంది. సోషల్ మీడియాను నియంత్రించడానికి ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలని సూచిస్తూ ఈ ధర్మాసనం కిందటి నెల 24వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ ను అందజేసింది. ఈ అఫిడవిట్ ను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ ధర్మాసనానికి సమర్పించారు.
కుప్పలు తెప్పలుగా అవాంఛనీయ సమాచారాలు.. వీడియో క్లిప్పింగులు
సామాజిక కార్యకలాపాల్లో సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తోందని, అయినప్పటికీ.. కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు. విధ్వేష పూరిత ప్రసంగాలు (హేట్ స్పీచ్), నకిలీ వార్తలు, అవాంఛనీయ, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని, వీడియో క్లిప్పింగులను ఇష్టానుసారంగా పోస్ట్ చేస్తున్నారని, దాని వల్ల సామాజిక పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి పోస్టింగులను నియంత్రించడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను నియంత్రించడానికి సరి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యే అసత్య కథనాల వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని వివరించింది.
సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లింకేజీ కేసు బదిలీ..
ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ కార్డును లింకేజీ చేయాలంటూ దాఖలైన కేసులను కూడా సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లింకేజీని కల్పించడంపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఇప్పటికే పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఒక్కో రాష్ట్ర హైకోర్టులో.. ఒక్కో దశలో విచారణ స్థితిలో ఉన్నాయా కేసులు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆయా పిటీషన్లన్నింటినీ కలిపి విచారణ చేయడానికి వీలుగా.. వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదలాయించింది. దీనిపై కేంద్రం త్వరలోనే అధికారిక ఉత్తర్వులను జారీ చేయనుంది.
పోర్న్ సైట్లకు అడ్డుకట్ట..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పోర్న్ వెబ్ సైట్లకు అడ్డుకట్ట వేసింది. ఛైల్డ్ పోర్న్.. అడల్ట్ కంటెంట్ ఉన్న సుమారు 800లకు పైగా వెబ్ సైట్లను నిషేధించింది. తాజాగా- సోషల్ మీడియా దూకుడుకు కూడా అడ్డుకట్ట వేయడానికి చేస్తోన్న ప్రయత్నాల వల్ల మిశ్రమ స్పందన ఎదురవుతోంది. అవాంఛనీయ, అసత్య వార్తలను నియంత్రించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. దాన్ని ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం మాత్రం సరికాదని అంటున్నారు నెటిజన్లు. ఆరోగ్యకరమైన పోస్టింగులు, షేర్లను అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.