అమ్మ జయలలిత విగ్రహం ఆవిష్కరణ: ముఖంలో చిన్నమ్మ శశికళ పోలికలు ఉన్నాయని!
Recommended Video
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ జయలలిత కంచు విగ్రహాన్ని చెన్నైలో బుధవారం అవిష్కరించారు. వేలాధి మంది అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల సమక్షంలో జయలలిత విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించారు. గతంలో ఏర్పాటు చేసిన అమ్మ విగ్రహం ముఖంలో శశికళ పోలికలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో దానిని తొలగించారు.
చెన్నైలోని రాయ్ పేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం జయలలిత కంచు విగ్రహాన్ని ఆవిష్కరించి గజమాలలు వేశారు.
ఈ సందర్బంగా జయలలిత తమిళనాడు ప్రజలకు చేసిన సేవల గురించి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం, మంత్రులు, పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు. జయలలిత మరణించిన తరువాత రాయ్ పేట్ లోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ఆవరణంలో ఉన్న ఎంజీఆర్ విగ్రహం పక్కనే జయలలిత విగ్రహం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు.
2016 డిసెంబర్ లో ఎంజీఆర్ విగ్రహం పక్కనే జయలలిత విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే విగ్రం చిన్నమ్మ శశికళ ముఖం పోలినట్లు ఉందని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. శశికళ కావాలనే తన ముఖం పోలికలు ఉన్నట్లు విగ్రహం తయారు చేయించారని అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు విమర్శలు చేశారు.
అనంతరం శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు విమర్శలు చెయ్యడంతో జయలలిత విగ్రహం మళ్లి చేయించాలని పళనిస్వామి, పన్నీర్ సెల్వం నిర్ణయించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తయారు చేయించిన అమ్మ జయలలిత విగ్రహాన్ని బుధవారం పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.