డెంగ్యూ వ్యాప్తికి చెక్: మరణాలకూ అడ్డుకట్ట: సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన సైంటిస్ట్ డాక్టర్
లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. కోట్లమంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడి.. కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శనివారం నాటి బులెటిన్ ప్రకారం దేశంలో 3,34,17,390 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,26,32,222 కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 3,40,639గా రికార్డయ్యాయి. 4,44,529 మంది కరోనా బారిన పడి మరణించారు. కొద్దిరోజులుగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కొత్త కేసులు 30 నుంచి 40 వేల మధ్య నమోదవుతున్నాయి.
విజృంభిస్తోన్న డెంగ్యూ
అదే సమయంలో- డెంగ్యూ విజృంభిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలపై డెంగ్యూ ఫీవర్ పంజా విసురుతోంది. ప్రత్యేకించి- ఉత్తర ప్రదేశ్లో పలువురు డెంగ్యూ బారిన పడి మరణించారు. దీన్ని నివారించడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ను నిర్మూలించడానికి ప్రత్యేకంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన తరహాలో- ఈ డెంగ్యూను రూపుమాపడానికి ఇప్పటిదాకా ఎలాంటి టీకాలు కూడా అందుబాటులో లేవు. దోమలను నివారించడం ద్వారా డెంగ్యూను అదుపు చేయడానికి అవకాశం ఉంది.
మరణాలకూ అడ్డుకట్ట..
ఈ పరిస్థితుల మధ్య- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తెర మీదికి వచ్చింది. డెంగ్యూను నివారించడానికి సాగించే పోరాటంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. దీనిద్వారా డెంగ్యూ ఫీవర్ వ్యాప్తి చెందడానికి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందడాన్ని, దాని వల్ల సంభవించే మరణాలను అరికట్టవచ్చని తేలింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో చెక్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ఎంఎల్ ద్వారా డెంగ్యూను నివారించవచ్చని, దాని వల్ల సంభవించే మరణాలకు కూడా అడ్డుకట్ట వేయొచ్చని యంగ్ డాక్టర్ కమ్ సైంటిస్ట్ డాక్టర్ అభిజిత్ రే స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెంగ్యూ తీవ్రతను తగ్గించడంతో పాటు ఆసుపత్రుల్లో పేషెంట్లకు మెరుగైన వైద్యాన్ని కల్పించడానికి కూడా ఇది ఉపకరిస్తుందని అన్నారు. డెంగ్యూ తీవ్రత పెరిగితే హ్యామరేజ్ తరహా పరిస్థితులు తలెత్తుతాయి. థ్రోంబోసైటోపీనియా, బ్లీడింగ్కు కారణమౌతాయి.
డెంగ్యూ షాక్ సిండ్రోమ్స్పై
శరీరంలో బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ అతి తక్కువ స్థాయికి దిగజారుతుంది. ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల మన శరీర వ్యవస్థ దెబ్బతింటుంది. ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. పౌష్టికాహారం శరీరానికి అందదు. దీన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్గా పిలుస్తారు. ఆది ఆ పేషెంట్ మరణానికి దారి తీయడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిన విషయాన్ని సకాలంలో గుర్తించకపోతే- పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. డెంగ్యూ షాక్ సిండ్రోమ్స్ను సకాలంలో గుర్తించి, దాన్ని నివారించాల్సి ఉంటుంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెంగ్యూ షాక్ సిండ్రోమ్స్ను నివారించవచ్చని ఇండియన్ డాక్టర్- సైంటిస్ట్ డాక్టర్ అభిజిత్ రే తెలిపారు. డెంగ్యూ చికిత్సలో కొత్త కోణాన్ని ఆయన ఆవిష్కరించారు. ఓ పేషెంట్లో డెంగ్యూ షాక్ సిండ్రోమ్స్ను సకాలంలో గుర్తించడానికి ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుందనే విషయాన్ని ఆయన గుర్తించారు. సాఫ్ట్వేర్ ద్వారా బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్, హెమటోక్రిట్ లెవెల్స్ను గుర్తించవచ్చని నిరూపించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథమ్స్ ద్వారా ప్లేట్లెట్స్, హెమటోక్రిట్ లెవెల్స్ను అక్యూరెట్గా నిర్ధారించవచ్చని పేర్కొన్నారు. డెంగ్యూ బారిన పడి మూడో రోజే వాటిని గుర్తించవచ్చని డాక్టర్ అభిజిత్ రే తెలిపారు.
ఖచ్చితంగా అంచనా వేయడానికి..
సైంటిస్ట్ డాక్టర్ అభిజితే రే చేసిన ఈ పరిశోధనలు డెంగ్యూ షాక్ సిండ్రోమ్స్ను సకాలంలో గుర్తించడానికి, దాన్ని నివారించడానికి ఉపయోగపడుతున్నాయి. ప్లేట్లెట్స్, హెమటోక్రిట్ లెవెల్స్ను ఖచ్చితంగా అంచనా వేయడం వల్ల ఆ పేషెంట్కు ఎలాంటి చికిత్సను అందించాల్సి ఉంటుందనే విషయంపై డాక్టర్లకు ఓ సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. దీనికి అనుగుణంగా డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెసలుబాటును కల్పిస్తుంది. దేశంలో డెంగ్యూ ఫీవర్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను డాక్టర్ అభిజితే రే కనుగొనడం గొప్ప వరంగా చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.