ప్రశాంత్ భూషణ్ 2009 కోర్టు ధిక్కార కేసు మరో బెంచ్ కు బదిలీ .. సిఫార్స్ చేసిన ధర్మాసనం
న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 2009 సంవత్సర కోర్టు ధిక్కరణ కేసు పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మరో కోర్టు ధికార కేసు విచారణలో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు తేల్చిన సుప్రీం ధర్మాసనం 2009 కేసులో నేడు విచారణ కొనసాగించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశాంత్ భూషణ్ కేసు విచారణను సుప్రీం కోర్టు మరో బెంచ్ కు సిఫార్సు చేశారు. ఈ కేసు విచారణకు తగిన బెంచ్ ను కేటాయించాలని ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ను కోరారు.
న్యాయవాది ప్రశాంత్ భూషణ్పై 2009 లో కోర్టు ధిక్కార కేసు
గత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సిజెఐ) అవినీతిపరుడని చేసిన వ్యాఖ్యలకు న్యాయవాది ప్రశాంత్ భూషణ్పై 2009 లో కోర్టు ధిక్కార కేసును సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారించనుంది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణలో భాగంగా ఈ విషయంలో భూషణ్ లేవనెత్తిన న్యాయపరమైన ప్రశ్నలను పరిష్కరించడానికి తగిన సమయం తనకు లేదని చెప్పారు. ఆయన సెప్టెంబర్ 2 న పదవీ విరమణ చేస్తున్నందున ఈ కేసును మరో బెంచ్ కు కేటాయించాలని కోరారు .
కేసు సమగ్ర దర్యాప్తుకు సమయం లేదు.. కేసు మరో బెంచ్ కు బదిలీ చెయ్యాలన్న జస్టిస్ అరుణ్ మిశ్రా
ఈ కేసు సమగ్ర విచారణ జరపాలంటూ నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ కేసు కేవలం శిక్ష కు సంబంధించిన కేసు కాదని, న్యాయవ్యవస్థపై నమ్మకానికి సంబంధించిన కేసు అని ఆయన అన్నారు. అందుకే ఈ కేసును విచారించడానికి తగిన బెంచ్ ను కేటాయించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను అభ్యర్థించారు. మరో బెంచ్ కేటాయింపు కోసం ఈ కేసును సెప్టెంబర్ 10న లిస్టింగ్ చేశారు. ప్రశాంత్ భూషణ్ కేసు విచారణ చేస్తున్న ప్రస్తుత ధర్మాసనంలో న్యాయమూర్తులు బిఆర్ గవై మరియు కృష్ణ మురారి కూడా ఉన్నారు.
న్యాయమూర్తుల మీద అవినీతి ఆరోపణలతో వరుస కేసులు
ప్రశాంత్ భూషణ్ గత సిజెఐ అవినీతిపరుడని 2009లో తెహెల్కా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ ప్రకటనను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు, దీని ఆధారంగా నవంబర్ 2009 లో అతనిపై కోర్టు ధిక్కార నేరం క్రింద కేసు విచారణ జరుగుతుంది .ఈ కేసు చివరిసారిగా విచారించిన ఎనిమిది సంవత్సరాల తరువాత జూలై 24 న ఉన్నత న్యాయస్థానం జాబితా చేసింది. తన ప్రకటనకు క్షమాపణ చెప్పడానికి భూషణ్ నిరాకరించిన ఆయన కోర్టుకు వివరణ ఇచ్చాడు.
బలంగా వాదనలు వినిపించిన భూషణ్ తరపు న్యాయవాది .. మరో బెంచ్ కు కేసు
ఆగస్టు 10 న కోర్టు భూషణ్ వివరణను తిరస్కరించింది. ఆయనను దోషిగా తేల్చింది . మరియు కేసును కొనసాగించాలని మరియు పూర్తి స్థాయిలో విచారించాలని నిర్ణయించింది.ఈ రోజు కేసు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ప్రశాంత్ భూషణ్ తరపున హాజరైన న్యాయవాది రాజీవ్ థావన్ తన వాదనను బలంగా వినిపించారు. న్యాయమూర్తుల అవినీతిని గురించి ప్రశ్నించినంత మాత్రాన అది ధిక్కారం కిందకి వస్తుందా రాదా అన్నది రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాలని ఆయన కోరారు.
Recommended Video
ప్రశాంత్ భూషణ్ పై ఉన్న మరో కేసులోనూ విచారణా ధర్మాసనంలో జస్టిస్ అరుణ్ మిశ్రా
ధర్మాసనం ఈ కేసును మరో బెంచ్ కు బదలాయించాలని పేర్కొంది. న్యాయమూర్తి అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం భూషణ్ పై ఉన్న మరోకేసు , అత్యున్నత న్యాయస్థానం, సిజెఐలను విమర్శిస్తూ ట్వీట్ చేసినందుకు కోర్టు ధిక్కార కేసును మంగళవారం విచారించనుంది. ఈ కేసులో భూషణ్ దోషిగా ఇప్పటికే తేల్చారు . ఈ కేసులో తీర్పు వెల్లడిస్తారని , శిక్షను ప్రకటిస్తారని భావిస్తున్నారు.