టెకీలకు పండగే!: రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో నియామకాలు..
న్యూఢిల్లీ: రాబోయే రెండు త్రైమాసికాల్లో దేశంలోని ఐటీ కంపెనీలు భారీగా టెకీలను నియమించుకోబోతున్నట్టు ఐటీ ఎంప్లాయ్ మెంట్ ఔట్ లుక్ సర్వే వెల్లడించింది. గత రెండు త్రైమాసికాలతో పోలిస్తే ఈ దఫా భారీ ఎత్తున నియామకాలు ఉంటాయని పేర్కొంది.
కొత్తగా వస్తున్న టెక్నాలజీలతో ఐటీ రంగంలో నియామకాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పింది. సర్వే నిర్వహించిన ఎక్స్పెరిస్ ఐటీ, మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ మన్మీత్ సింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
ఉపాధి అవకాశాలైతే ఉన్నాయని, తమ నైపుణ్యాలను పదునుపెట్టకుని వాటిని అందిపుచ్చుకోవడానికి ఉద్యోగులు సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు. స్వయం శిక్షణ ద్వారా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, బిగ్ డేటా అనలిసిస్, మెషీన్ లెర్నింగ్, ఏఐ డెవలపర్స్ కు మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు.
0-5ఏళ్ల అనుభవంతో మంచి నైపుణ్యాలు కలిగినవారికి కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయని అన్నారు. అదే సమయంలో సీనియర్లను రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీలు ఆసక్తి కనబర్చడం లేదని, తద్వారా సీనియర్ల రిక్రూట్ మెంట్లు తగ్గిపోతున్నాయని వెల్లడించింది. దాన్ని అధిగమించాలంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఐటీ పరిశ్రమలో మార్పులకు అనుగుణంగా మారాల్సి ఉంటుందన్నారు.