18 మెట్లెక్కలేదు.. అయ్యప్ప దర్శనం సంపూర్ణమా? మహిళల దర్శనంలో కొత్త ట్విస్ట్
Recommended Video
కేరళ : ఇద్దరు మహిళల అయ్యప్ప ఆలయ దర్శనం సంపూర్ణమా? తెల్లవారుజామున ఆలయ ప్రవేశం హడావిడిగా ఎందుకు జరిగినట్లు. భక్తజన సందోహం భారీగా లేని సమయంలో పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దర్శనభాగ్యానికి తెర తీశారా? ఇలాంటి అనుమానాలెన్నో? అయితే ఇలాంటి వాటిని లోతుగా ఆలోచిస్తేనే సరైన జవాబులు దొరుకుతాయి.
బుధవారం తెల్లవారుజామున శబరిమల అయ్యప్ప సన్నిధిలోకి మహిళలు ప్రవేశించడం వివాదస్పదమైంది. అయితే వీరిద్దరు ఆలయంలోకి రావడం వెనుక కొన్ని శక్తులు పనిచేశాయన్నది అయ్యప్ప భక్తుల ఆరోపణ.
డ్రెస్ కోడ్ ఓకే.. మరి నిబంధనలు?
50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు అయ్యప్ప ఆలయంలోనికి ప్రవేశించడం నిషేధం. అయితే తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. గతేడాది సెప్టెంబర్ 28న 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లొచ్చంటూ తీర్పునిచ్చింది. ఆ క్రమంలో ఎంతోమంది మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా అయ్యప్ప భక్తులు అడుగడుగునా అడ్డుకున్నారు. శబరిమల పరిసరాల్లోకి రాకుండా నియంత్రించారు. ఇలా చాలా సందర్భాల్లో అయ్యప్ప దర్శనానికి ట్రై చేసి విఫలమయ్యారు.
అలాంటిది బుధవారం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు 40 ఏళ్ల లోపు వయసున్న ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధికి చేరుకున్నారనే వార్త వైరల్ గా మారింది. వీరిద్దరు ఆలయ నిబంధనల ప్రకారం నల్లని దుస్తులు ధరించి డ్రెస్ కోడ్ పాటించినా.. కొన్ని విషయాలు విస్మరించడం అనుమానాలకు తావిస్తోంది.
18 మెట్లు ఎక్కలేదు.. ఇరుముడి కట్టలేదు
అయ్యప్ప దర్శనం జరగాలంటే ఇరుముడి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే 18 పడి మెట్లు ఎక్కి అయ్యప్ప సన్నిధికి చేరుకుంటేనే శబరిమల యాత్ర పూర్తవుతుంది. అలాంటిది ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లిన తీరు అనుమానస్పదంగా ఉందనే వాదన తెరపైకి వచ్చింది. అయితే వీరు ఆలయంలోకి ప్రవేశించినట్లుగా ఉన్న వీడియోలు చూస్తే అసలు విషయం బోధపడుతుంది. పడి మెట్లు ఎక్కకుండా పక్కనుంచి ఆలయంలోకి వెళ్లినట్లుగా అర్థమవుతుంది. అంతేకాదు వీరిద్దరి తలలపై ఇరుముడి కూడా లేకపోవడం గమనార్హం. నల్లని దుస్తులు, ఇరుముడి, 18 పడి మెట్లు.. ఇలా శబరిమల యాత్ర సంపూర్ణమవుతుంది. కానీ ఈ ఇద్దరి మహిళల విషయంలో ఒక డ్రెస్ కోడ్ తప్ప మిగతా నిబంధనలు ఉల్లంఘించినట్లుగానే ఉంది వ్యవహారం. అదలావుంటే వీరు లోపలికి వెళుతున్నట్లుగా ఉన్నది అసలు సన్నిధానం కాదనేది కూడా ఒక వాదన.
సంప్రదాయంగా ట్రాన్స్జెండర్లకు అయ్యప్ప దర్శనం
గతేడాది డిసెంబర్ 16న అయ్యప్ప దర్శనానికి శబరిమలకు చేరుకున్నారు నలుగురు ట్రాన్స్జెండర్లు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. చివరకు ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడి ట్రాన్స్జెండర్లకు దర్శనభాగ్యం కల్పించారు. అయితే వీరు ఆలయ నిబంధనలు తూచా తప్పకుండా పాటించారు. నల్లని దుస్తులు ధరించడమే గాకుండా ఇరుముడి తలపై పెట్టుకుని 18 పడి మెట్లు ఎక్కి సన్నిధానంకు చేరుకున్నారు. అంటే వీరి శబరిమల యాత్ర సంపూర్ణమైనట్లు. అలాంటిది తాజాగా ఇద్దరు మహిళలు ఆలయం లోనికి వెళ్లిన తీరు సరిగాలేదని మండిపడుతున్నారు భక్తులు.
ఇంకా ఎవరొచ్చినా సహకరిస్తాం : కేరళ సీఎం
ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశాన్ని ధృవీకరించారు కేరళ సీఎం పినరాయి విజయన్. బుధవారం తెల్లవారుజామున వారిద్దరు అయ్యప్పను దర్శించుకున్నారని ప్రకటించారు. అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఇంకా ఎవరు వచ్చినా ఆలయంలోకి పంపేందుకు సిద్ధమని తెలిపారు. అయితే సీఎం వ్యాఖ్యలపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. శబరిమల ఆలయానికి కళంకం తెచ్చే పని ఎవరూ చేసినా ఉపేక్షించబోమని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు మహిళల ఎంట్రీపై వివాదం చెలరేగడంతో శబరిమలలో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.