న్యూ వ్యాక్సిన్ పాలసీ: 18ఏళ్లుపైబడినవారికీ ఉచిత వ్యాక్సిన్, వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనూ వివరాల నమోదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేటి నుంచి 18ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.
నూతన వ్యాక్సినేషన్ విధానంలో భాగంగా దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్ డోసులు కేంద్రం సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా మరో 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు ఆస్పత్రులకు తయారీ సంస్థలు విక్రయించుకోనున్నాయి. ఇప్పటి వరకు 45ఏళ్లకుపైబడినవారికే కేంద్రం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది.
నేటి నుంచి 18 ఏళ్లుపైబడినవారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వమే.. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ అందించనుంది. దేశంలో ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తుండగా, మరో 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు కంపెనీలు విక్రయించేందుకు అనుమతిచ్చింది. వ్యాక్సిన్ డోసులు అమ్మేందుకు నేషనల్ హెల్త్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ అథారిటీ ద్వారా ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేస్తాయి.
హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు, 45ఏళ్లపైబడినవారు, రెండో డోసు పెండింగ్లో ఉన్న వాళ్లతోపాటు 18ఏళ్లు నిండినవారికి ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్లను ప్రభుత్వాలు అందించనున్నాయి. రాష్ట్రాల జనాభా, కరోనా వ్యాప్తి, ఇప్పటి వరకు జరిగిన వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ వృథా లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయించనుంది.
Recommended Video
కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ డోసులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలకు ముందుగానే సమాచారం ఇవ్వనున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే వ్యాక్సిన్ డోసుల ధరను తయారీ సంస్థలు నిర్ణయించనున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు సర్వీస్ ఛార్జీల కింద డోసుకు రూ. 150 మించి వసూలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.