శాప విముక్తి-400ఏళ్ల నిరీక్షణకు తెర: మైసూరుకు బుల్లి వారసుడొచ్చాడు
Recommended Video
బెంగళూరు: నాలుగు శతాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. ఎట్టకేలకు మైసూరు రాజవంశానికి వారసుడొచ్చాడు. మైసూరు రాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్- త్రిషికా కుమారి సింగ్ దంపతులకు బుధవారం కుమారుడు జన్మించాడు. దీంతో రాజవంశంతో పాటు మైసూరు అంతటా సంబరాలు అంబరాన్నంటాయి.
మగబిడ్డకు జననం
మైసూరు యువరాణి త్రిషికా బుధవారం ఉదయం పురుటి నొప్పులతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. రాత్రి పొద్దుపోయాక ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
400ఏళ్ల నాటి శాపం నుంచి విముక్తి
మైసూరు యువరాజు యదువీర్ దంపతులకు కుమారుడు జన్మించడంతో సుమారు 400 ఏళ్ల నాటి శాపానికి విముక్తి కలిగిందని మైసూరు రాజ కుటుంబ వర్గాలు చెబుతున్నాయి.
చరిత్ర ప్రకారం..
చరిత్ర ప్రకారం.. క్రీ,.శ 1600 సంవత్సరంలో అప్పటి మైసూరు రాజు విజయనగర సామ్రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. విజయనగర రాజు అయిన తిరుమల రాజుతోపాటు ఆయన భార్య అలివేలమ్మను బంధించాలని సైనికులను పంపారు. వారి నుంచి తప్పించుకునేందుకు అలివేలమ్మ సమీపంలోని మాలతి గ్రామంలో తలదాచుకున్నారు.
శపించిన అలివేలమ్మ
కాగా, ఈ విషయం తెలుసుకున్న సైనికులు ఆమెను చంపేందుకు ప్రయత్నించగా, ఆమె ఆగ్రహంతో.. మైసూరు రాజవంశానికి సంతాన భాగ్యం కలగదని శపించి కావేరీ నదిలో దూకి తనువు చాలించింది. అప్పటి నుంచి మైసూరు రాజ వంశీయులకు పిల్లలు కలగడం లేదు. దీంతో బంధువుల్లో యోగ్యుడైన యువకుడిని దత్తత తీసుకుని మహారాజుగా ప్రకటిస్తూ వస్తున్నారు. దాదాపు నాలుగు శతాబ్దాల తర్వాత వారుసుడు రావడంతో ఆమె శాపానికి విముక్తి లభించినట్లయింది.