నిర్లక్ష్యానికి తగిన మూల్యం?: కరోనా కేసుల పెరుగుదల..ఆందోళనకరంగా: లాక్డౌన్ తప్పదా?
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు కొత్తగా పుట్టుకొస్తోన్నాయి. ఈ మహమ్మారి క్రమంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో భయానకంగా విస్తరిస్తోంది. వరుసగా రెండురోజుల్లో 12 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసకోవచ్చు. దీన్ని నియంత్రించడంలో భాగంగా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ను విధించింది. అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అమరావతి, అకోలా, యావత్మల్లల్లో లాక్డౌన్ను విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. యావత్మల్లో ఇప్పటికే 10 రోజుల కర్ఫ్యూ అమల్లో ఉంటోంది.
ఆయా జిల్లాల్లో కరోనా కొత్త కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది. ఆ జిల్లాల ప్రభావం పొరుగునే ఉన్న తెలంగాణపైనా పడుతోంది. ఉత్తర తెలంగాణ కరోనా కేసులు క్రమంగా పెరుగుతోన్నాయనే ఆందోళనలు ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య మరోసారి జాతీయ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుదల బాట పట్టాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,264 కేసులు నమోదు అయ్యాయి. 90 మంది మరణించారు. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 1,09,91,651కి చేరుకున్నాయి. ఇందులో 1,06,89,715 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షన్నరను దాటింది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,56,302 మంది మృతి చెందారు. 24 గంటల్లో కొత్తగా 11,667 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,45,634గా నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో శనివారం కూడా ఆరువేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం నాటి లెక్కలతో పోల్చుుకుంటే ఈ సంఖ్య ఎక్కువ. శనివారం ఒక్కరోజే 6,281 కేసులు వెలుగులోకి వచ్చాయి.
దీని తీవ్రత విదర్భ ప్రాంతంలోనే అధికంగా ఉంటోంది. అమరావతి, అకోలా, యావత్మల్, వార్ధా, బుల్దానాల్లో కేసులు పెరుగుతున్నాయి. వార్ధా-4.62, అకోలా-4.27, యావత్మల్-3.19, బుల్ధానా-2.28 శాతల కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైంది. దీనితో ఆయా జిల్లాల్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ముంబైలో కరోనా ప్రొటోకాల్ అమలు చేయడాన్ని తప్పనిసరి చేసింది. కరోనా నిబంధనలను పాటించని హోటళ్లు, ఇతర షాపింగ్ మాల్స్కు సీజ్ చేస్తోంది.