కొత్త కరోనా కేసుల హాట్స్పాట్స్ ఇవే: గుబులు పుట్టిస్తోన్న స్ట్రెయిన్
న్యూఢిల్లీ: దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు గుబులు పుట్టిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల కొత్త కేసులు నమోదు అయ్యాయి. సాధారణ కరోనాతో పోల్చుకుంటే 70 శాతం వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నందున.. దాన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించాయి. ఈ పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా సాధారణ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుదల బాట పట్టడం ఆందోళనకు దారి తీస్తోంది.
షాకింగ్: ఫైజర్ వ్యాక్సిన్ పనిచేయట్లేదా?: టీకా వేయించుకున్న నర్సుకు కరోనా పాజిటివ్: అనారోగ్యం
దేశవ్యాప్తంగా కొత్తగా 21,821 కరోనా వైరస్ పాజిటివ్ కేసులునమోదు అయ్యాయి. 299 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 1,02,66,674కి చేరుకున్నాయి. ఇందులో 98,60,280 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షన్నరకు చేరువ అవుతోంది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,48,738 మంది మృతి చెందారు. 24 గంటల్లో కొత్తగా 26,139 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 2,57,656గా నమోదు అయ్యాయి. కరోనా మరణాలు లక్షన్నరకు చేరువ అవుతున్నాయి.
ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్లోనే. అమెరికా-3,50,778, బ్రెజిల్-1,93,940 మంది మరణించారు. భారత్లో 1,48,774 మంది మృతి చెందారు. మెక్సికోలో 1,24,897, ఇటలీలో 73,604 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. ఈ పరిణామాల మధ్య బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కనిపించడం కలకలం రేపుతోంది. బ్రిటన్లో ఇప్పటికే కరోనా సోకి 72,548 మంది మృతి చెందగా.. 24,32,888 కేసులు అక్కడ నమోదు అయ్యాయి.
పలు రాష్ట్రాలు కరోనా వైరస్ హాట్స్పాట్లుగా మారుతున్నాయి. కర్ణాటకలో అత్యధికంగా 11 కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. శివమొగ్గకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు కొత్త కరోనా మహమ్మారి బారిన పడ్డారు. బెంగళూరులో ఏడు కేసులు నమోదు అయ్యాయి. ఏపీ, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్లల్లో క్రమంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. కొత్త సంవత్సరం వేడుకలపై దాదాపు అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా 144 సెక్షన్ను విధించాయి.