కరోనా కోరల నుంచి బయటపడుతున్నామా?: ఈ తగ్గుదల దేనికి సంకేతం?: మరణాల్లోనూ అదే స్థితి
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయికి పడిపోయాయి. దేశ:లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత..బిత్తరపోయేలా పెరిగాయి కరోనా కేసులు. ఇప్పుడా సంఖ్య ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 36,469 మాత్రమే. ఇదివరకు నమోదైన రోజువారీ కేసులతో కంపేర్ చేస్తే.. మూడొంతుల మేర తగ్గినట్టే. మరణాల్లోనూ అదే క్షీణత కనిపిస్తోంది.
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్కు మరో బ్రేక్: ఆ యాంటీబాడీ డ్రగ్ వల్ల నో యూజ్: ఇప్పట్లో కష్టమే
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 36,469 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 488 మంది మరణించారు. 500లకు దిగువగా కరోనా మరణాలు నమోదు శుభపరిణామంగా భావిస్తున్నారు అధికారులు. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందడానికి దీన్ని సాక్ష్యంగా చూపుతుననారు. ఇప్పటిదాకా దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 79,46,429కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 6,25,857కు తగ్గింది. మొత్తం మరణాలు 1,19,502కు చేరుకున్నాయి. మొత్తం డిశ్చార్జీలు 72,01,070గా నమోదు అయ్యాయి. కొత్తగా ఈ 24 గంటల్లో 63,842 మంది డిశ్చార్జి అయ్యారు.
ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు బులెటిన్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో అదే దూకుడు కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 10,44,20,894 పరీక్షలను నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 9,58,116 కరోనా నిర్దారణ పరీక్షలను నిర్వహించినట్లు పేర్కొంది. పండుగల సీజన్లోనూ రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడానికి.. దాని పట్ల ప్రజల్లో నెలకొన్న అవగాహన, చైతన్యమే కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు.
కరోనా మరణాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతం అయ్యాయని చెబుతున్నారు. కరోనా కోరల నుంచి క్రమంగా దేశ ప్రజలు బయటపడుతున్నారని, ఇవే పరిస్థితులు మరికొంతకాలంపాటు కొనసాగాల్సిన అవసరం ఉందని వారు ఆశిస్తున్నారు. ఒకవంక సీజనల్ వ్యాధులు ముసురుకుంటుండటం, మరోవంక వరదల సమయంలోనూ రోజువారీ కేసులు తగ్గడం మంచి పరిణామమని, కరోనా క్రమంగా తగ్గుతోందడానికి దీన్ని సంకేతంలా భావించుకోవచ్చని చెబుతున్నారు. కొత్త కేసుల్లో మరింత తగ్గుదలను ఆశిస్తున్నామని అంటున్నారు.