90 లక్షలకు చేరువగా కొత్త కేసులు: పండగ సీజన్లోనూ పరిమితంగానే: ఇక చలి గండం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోంది. పండుగల సీజన్లోనూ భయపడినంతగా కొత్త కేసులు నమోదు కాలేదు. చాలా రాష్ట్రాల్లో క్రమంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ రోజువారీ కేసుల్లో ఆ స్థాయి పెరుగుదల నమోదు కాకపోవడం పట్ల అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రోజువారీ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకోకపోవడం వల్ల కరోనా తీవ్రత తగ్గుతున్నట్లుగా భావిస్తున్నారు.
దేశంలో కొత్తగా 38,617 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 474 మంది మరణించారు. మంగళవారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే.. కొత్త కేసుల సంఖ్య చాలా ఎక్కువ. ఇదివరకు నమోదైన రోజువారీ కేసులను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం.. కొత్త కేసులు పరిమితంగా నమోదైనట్టే. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 89,12,908కి చేరుకున్నాయి. ఇందులో 83,35,110 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షా 30 వేలను దాటుకుంది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,30,993 మంది మృతి చెందారు.
ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్లోనే. అమెరికా-2,54,255, బ్రెజిల్-1,66,743 మంది మరణించారు. దేశంలో నమోదైన మొత్తం డిశ్చార్జీల సంఖ్య 83,35,110కి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు నాలుగున్నర లక్షకు దిగువగా చేరాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 4,46,805 మంది పేషెంట్లు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.
Recommended Video
పండగ సీజన్ సందర్భంగా ప్రజలు కరోనా వైరస్ పట్ల అజాగ్రత్తగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుందని, ఫలితంగా రోజువారీ కరోనా కేసులు భారీగా పెరగొచ్చని అధికారులు అంచనా వేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పండగ సీజన్ సందర్భంగా అలసత్వాన్ని ప్రదర్శించొద్దని, ముందు జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సీజన్ ముగిసే సరికి రోజువారీ కొత్త కేసులు పరిమితంగా నమోదు అయ్యాయి. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడం, డిశ్చార్జీలు భారీగా పెరుగుతుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య క్షీణిస్తోంది.