తగ్గుతూ..పెరుగుతూ: దేశంలో లక్షా 35 వేలకు చేరువగా మరణాలు: కరోనా మళ్లీ పడగ విప్పుతోందా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుదల బాట పట్టినట్టు కనిపిస్తోంది. పండుగల సీజన్లో భయపడినంతగా కొత్త కేసులు నమోదు కానప్పటికీ.. దాని తరువాత కేసులు పైపైకి ఎగబాకడం ప్రారంభించాయి. చాలా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోన్న వాతావరణ మార్పులు కూడా దీనికి తోడైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోజువారీ కేసుల్లో తాజాగా నమోదవుతోన్న పెరుగుదల ఆందోళనకరంగా మారింది. కరోనా వైరస్కు సీజనల్ వ్యాధులు కూడా తోడైతే.. పరిస్థితులు కట్టుతప్పొచ్చని అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
దేశంలో కొత్తగా 45,209 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 501 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 90,95,807కు చేరుకున్నాయి. ఇందులో 85,21,617 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షా 35 వేలకు చేరువ అవుతోంది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,33,227 మంది మృతి చెందారు. ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్లోనే.
అమెరికా-2,61,790, బ్రెజిల్-1,69,016 మంది మరణించారు. ఈ రెండు దేశాల్లో మరణాల సంఖ్యలో వేగం మందగించింది. రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా కోలుకుంటోన్న వారి సంఖ్య మెరుగుపడుతోంది. భారత్ తరువాత ఆ స్థాయి మరణాలు మెక్సికోలో నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా అక్కడ 1,01,373 మంది మరణించారు. మెక్సికోలో నమోదైన కేసులు 10,32,688. మరణాల రేటు మెక్సికోలో తీవ్రంగా ఉంటోంది. 10 లక్షల కేసులకు లక్ష మంది మరణించిన ఉదంతం మరే దేశంలోనూ లేదు. కేసుల తీవ్రతా అధికంగా ఉంటోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా మరణాలు నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా 13,17,33,134 కోట్ల నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు. శనివారం ఒక్కరోజే 10,75,326 శాంపిళ్లను పరీక్షించామని, కరోనా మరణాల రేటు 1.5 శాతంగా నమోదైనట్లు తెలిపారు. 93.7 శాతం మేర పేషెంట్లు కోలుకుంటున్నారని చెప్పారు.