దేశంలో 70 లక్షలకు పైగా: మృతులు రోజూ వందల్లోనే: లక్షా 10 వేలకు టచ్ అయ్యేలా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. తాజాగా ఈ సంఖ్య మరింత పైకి వెళ్లింది. లక్షా 10 వేలకు చేరువ అవుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 918 మంది కరోనా కాటుకు గురయ్యారు. రోజూ వందల సంఖ్యలో కరోనా బారిన పడి దేశ ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజా మరణాలతో ఈ సంఖ్యయ 1,08,334కు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ.. పాజిటివ్ కేసులు.. మరణాల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. ఇదివరకు నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే స్వల్పంగా..గణనీయ మార్పులేవీ నమోదు కావట్లేదు.
కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ఈ కల్లోల పరిస్థితులు ఇలాగే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 74,383 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 918 మంది మరణించారు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 70,53,807కు చేరుకుంది. 1,08,334 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,67,496కు చేరుకుంది. 60,77,977 మంది డిశ్చార్జి అయ్యారు.
దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. మరోవంక- దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. అయినప్పటికీ.. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపించడం శుభపరిణామమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదివరకు అత్యధికంగా రోజువారీ కేసుల్లో 90 వేలకు పైగా పెరుగుదల రికార్డయ్యేదని, ఈ సంఖ్య ప్రస్తుతం 75 వేలలోపు పడిపోయిందని చెప్పారు.
Recommended Video
నిర్ధారణ పరీక్షలు యధాతథంగా పెద్ద ఎత్తున సాగుతున్నప్పటికీ..రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. శనివారం ఒక్కరోజే 10,78,544 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా రికార్డయిన మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 8,68,77,242కు చేరుకున్నాయని అన్నారు. ఏపీ సహా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో నమోదవుతోన్న రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయని, దాని ఫలితంగా జాతీయ స్థాయిలో రోజువారీ పాజిటివ్స్ సంఖ్యలో క్షీణత కనిపిస్తోందని అంచనా వేశారు.