భారత్ అన్ వాంటెండ్ రికార్డ్: లక్షను దాటిన కరోనా మరణాల్లో: ఈ మూడు దేశాల్లో విలయం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. తాజాగా ఈ సంఖ్య మరింత పైపైకి వెళ్తూనే ఉంది. కొత్తగా 940 మంది కరోనా కాటుకు గురయ్యారు. ప్రాణాలు వదిలారు. తాజా మరణాలతో ఈ సంఖ్యయ 1,01,782కు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ.. పాజిటివ్ కేసులు.. మరణాల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందే తప్ప.. గణనీయ మార్పులేవీ నమోదు కావట్లేదు. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ఈ కల్లోల పరిస్థితులు ఇలాగే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 75,829 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 940 మంది మరణించారు. ఇదివరకు 1100కు పైగా నమోదయ్యే ఈ సంఖ్య కాస్త తగ్గింది. అంతే తప్ప పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 65,49,374కు చేరుకుంది. 1,01,782 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,37,625కు చేరుకుంది. 55,09,967 మంది డిశ్చార్జి అయ్యారు.
దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రాల్లో అనూహ్య సంఖ్యలో పుట్టుకొస్తోన్న కొత్త కేసుల వల్ల దేశవ్యాప్తంగా లక్ష వరకు రోజువారీ లెక్కలు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి శనివారం వరకూ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య ఎనిమిది కోట్ల మార్క్కు చేరువైంది.
Recommended Video
ఇప్పటిదాకా 7,89,92,534 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజులో 11,42,131 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. కరోనా వైరస్ మరణాల సంఖ్య అనూహ్యంగా లక్షను దాటిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో బ్రెజిల్ ఉండగా.. క్రమంగా ఆ దేశానికి చేరువ అవుతోంది. బ్రెజిల్లో ఇప్పటిదాకా 1,46,011 మంది కరోనా కాటుకు గురి అయ్యారు. లక్షకు పైగా మరణాలను నమోదు చేసిన మూడో దేశంగా భారత్ అవాంఛిత రికార్డును నెలకొల్పింది.