సీఎం యోగి స్ట్రిక్ట్ ఆర్డర్స్.. పార్టీ ఏదైనా డోన్ట్కేర్ : యూపీ కొత్త డీజీపీ
ఉత్తరప్రదేశ్ కొత్త డీజీపీగా సుల్ఖాన్ సింగ్ ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియమించారు. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ రాష్ట్ర పోలీసు శాఖలో భారీ మార్పు శనివారం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు డీజీపీగా పనిచేసిన జావేద్ అహ్మద్ స్థానంలో సుల్ఖాన్ సింగ్ను నియమించారు సీఎం యోగి. కొత్త డీజీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగిపోయింది.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుల్ఖాన్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవరిస్తామని స్పష్టం చేశారు. వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వారు అనే విషయంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారని ఆయన వెల్లడించారు.
అవినీతి విషయంలో అసలు సహించేది లేదని తేల్చి చెప్పారు. గూండాగిరిని నియంత్రించడానికి పూర్తి స్థాయిలో నిష్పక్షపాత ధోరణితో ఉత్తరప్రదేశ్ పోలీసులు పనిచేస్తారని అన్నారు.
యాంటీ రోమియో స్క్వాడ్ అంశంపై కూడా కొత్త డీజీపీ స్పందించారు. అభ్యంతరకరంగా ప్రవర్తించిన వారి విషయంలోనే యాంటీ రోమియో స్క్వాడ్ చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా సరే.. గోరక్షణ, ఇతర పేర్లతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని, కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ సుల్ఖాన్ సింగ్ హెచ్చరించారు.