యూనివర్శటీ క్యాంపస్లో మృతదేహాలుగా నవ దంపతులు! హైస్కూల్ విద్యార్థులుగా గుర్తింపు
కోల్కత: కొత్తగా వైవాహిక జీవతంలోకి అడుగు పెట్టిన విద్యార్థులు విగత జీవులుగా కనిపించిన ఘటన ఇది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా బోల్పూర్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను సోమనాథ్ మహంతో, అవంతికగా గుర్తించారు. వారిద్దరిదీ టీనేజ్ వయస్సే కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సోమనాథ్ మహంతో, అవంతిక ఇద్దరు బోల్పూర్లోని శ్రీనందా హైస్కూల్ విద్యార్థులుగా నిర్ధారించారు. సోమనాథ్ ప్లస్ టూ చదువుతుండగా.. అవంతిక ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసినట్లు చెబుతున్నారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం క్యాంపస్లోని చీనా భవన్ వద్ద శనివారం రాత్రి సెక్యూరిటీ గార్డులు మృతదేహాలను గుర్తించారు. వెంటనే విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్కు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న రిజిస్ట్రార్, స్థానికులు పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్మార్టమ్ నివేదిక అందిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటన వెనుక గల అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.