నెలకిందటే పెళ్లి: అంతలోనే ఆత్మహత్య: సూసైడ్ నోట్లో అసలు కారణం
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి, పెద్దలను ఎదిరించి ఒక్కటైన ఓ ప్రేమజంట తనువు చాలించింది. బలవన్మరణానికి పాల్పడింది. తమ ఆత్మహత్యకు పెద్దల వేధింపులే కారణమని తెలుస్తోంది. బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డ బళ్లాపుర తాలూకా పరిధిలోని వీరాపురంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను దొడ్డ బళ్లాపురలోని కచేరి పాళ్యకు చెందిన వెంకటరాజు కుమారుడు విజయ్, శాంతినగర ప్రాంతానికి చెందిన లీలావతిగా పోలీసులు గుర్తించారు.
విజయ్, లీలావతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చిక్ బళ్లాపురలో ఒకే కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు తెలియజేశారు. వేర్వేరు కులాలకు చెందినవారు కావడం వల్ల ఇరు కుటుంబాల్లో పెద్దలు వారి ప్రేమను ఆశీర్వదించలేదు. పెళ్లి చేయడానికి నిరాకరించారు.
అయినప్పటికీ- వారు పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా నెలరోజుల కిందట తమ స్నేహితుల సహాయంతో గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం వారి కుటుంబీకులకు తెలిసింది. ఆగ్రహానికి గురైన ఇరు కుటుంబీకుల పెద్దలు విడదీయడానికి ప్రయత్నించారు. దొడ్డ బళ్లాపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్, లీలావతిని స్టేషన్కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కొద్దిరోజుల పాటు వారిద్దరూ వేర్వేరుగా నివసించారు.
ఆదివారం వారిద్దరూ తమ తమ ఇళ్లల్లో నుంచి మాయం అయ్యారు. వారి కోసం అన్వేషిస్తుండగా వీరాపుర వద్ద రైల్వే పట్టాలపై మృతదేహాలుగా కనిపించారు. మృతదేహాలను చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టాల పక్కన విజయ్కు చెందిన బైక్, దాని పక్కనే ఆత్మహత్య లేఖ కనిపించింది. ఈ లేఖను లీలావతి రాసినట్టుగా చెబుతున్నారు. తన మామ తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని, అందువల్లే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆత్మహత్య లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.