న్యూస్ 24-టుడేస్ చాణక్య: యూపీ, బెంగాల్లో బీజేపీకి భారీ మెజారిటీ: మహాకూటమికి పరాభవం
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వసనీయంగా భావిస్తోన్న టుడేస్ చాణక్య తన అంచనాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా మరోసారి బీజేపీ హవా వీస్తోందని స్పష్టం చేసింది. హిందీ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్స్వీప్ చేయబోతోందని, దక్షిణాదిలో కొంత ఎదురుగాలి వీస్తున్నప్పటికీ.. మిగిలిన రాష్ట్రాల్లో తిరుగులేని మెజారిటీని సాధిస్తోందని తేటతెల్లం చేసింది.
ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉండగా.. భారతీయ జనతా పార్టీ మొత్తం 65 స్థానాలను గెలుచుకుంటుందని న్యూస్ 24- టుడేస్ చాణక్య వెల్లడించింది. బీజేపీని ఓడించడానికి సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలు కూటమి కట్టినప్పటికీ.. ఫలితం లేదని సర్వే తేట తెల్లం చేసింది. మహాకూటమి పార్టీలకు ఘోర పరాభవం తప్పదని పేర్కొంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీకి మొత్తం 71 స్థానాలు దక్కించుకుంది. ఈ సారి కొన్ని స్థానాలను కోల్పోక తప్పదని టుడేస్ చాణక్య అంచనా వేసింది.
అలాగే- పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని వెల్లడించింది. మొత్తం 42 స్థానాలకు గాను 18 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని అభిప్రాయపడింది. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్.. అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకున్నప్పటికీ.. 2014 నాటి ఎన్నికలతో పోల్చుకుంటే భారీగా సీట్లను బీజేపీకి కోల్పోతుందని అంచనా వేసింది. తృణమూల్ కాంగ్రెస్ 23 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది.