మీడియా సిబ్బందిపై ఫైరింగ్.. ఢిల్లీలో సినిమాను తలపించిన సీన్..
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన సినిమా సీన్ను తలిపించింది. న్యూస్ కవరేజ్కు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేట్ ఛానెల్ సిబ్బందిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అయితే దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై వేటు పడింది.శనివారం అర్థరాత్రి 1.30గంటల సమయంలో హిందీ న్యూస్ ఛానెల్కు చెందిన రిపోర్టర్, కెమెరామెన్ ఓ బిజినెస్ మేన్ హత్యకు సంబంధించిన క్రైం స్టోరీ కవరేజ్కి వెళ్లారు. నోయిడా నుంచి కరోల్ బాగ్ వైపు వెళ్తుండగా... బారాపుల్లా ఫ్లైఓవర్ వద్ద బ్లాక్ కలర్ పల్సర్ బైక్పై ఇద్దరు వ్యక్తులు వారికి అటకాయించారు. దుండగుల్లో ఒకడు తుపాకీ చూపిస్తూ కారు ఆపమని హెచ్చరించారు.
అలా బెదిరిస్తూ దాదాపు కిలోమీటర్ వరకు వెంబడించడంతో డ్రైవర్ భయంతో కారు ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే రిపోర్టర్, కెమెరామెన్ వారించడంతో ముందుకు పోనిచ్చారు. దీంతో ఆగ్రహించిన దుండగులు వారిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. మొదటి బుల్లెట్ కార్ డోర్కు రెండోది కారు అద్దానికి తగలగా.. మూడోది మిస్సైంది. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
ఆరుగురు పోలీసుల సస్పెండ్ : 8 ఏళ్ల బాలిక లైంగికదాడి కేసులో చర్యలు
కాల్పుల ఘటనపై మీడియా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తొలుత ఎవరూ స్పందించలేదు. దాదాపు రెండు గంటల అనంతరం తాపీగా ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.