news makers 2019: షాహెన్ షా, నమో నమ: కీలక చట్టాలు, త్రిపుల్ తలాక్ నుంచి సీఏఏ వరకు
నరేంద్ర మోడీ, అమిత్ షా.. ఒకరు తెరముందు కనిపించే వాగ్బాటి, మరొకరు తెరవెనుక చాణక్యం ప్రదర్శించే ఉద్దండులు. కేంద్రంలో బీజేపీకి వరుసగా రెండోసారి సుస్థిర ప్రభుత్వం అందించడంలో వీరిద్దరిదీ కీ రోల్. మోడీ 2.0 ప్రభుత్వం కొలువుదీరాక కీలక నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తున్నారు. బీజేపీకి 300 పైచిలుకు సభ్యులు ఉండటం, బలమైన విపక్షం లేకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకొంటూ తమ పార్టీకి బలమైన క్యాడర్ నిర్మించుకుంటూ ముందుకెళ్తున్నారు.
మే నెలలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక నరేంద్ర మోడీ, అమిత్ షా వెనుదిరిగి చూసుకోలేదు. ఒక్కట రెండా త్రిపుల్ తలాక్, కశ్మీర్ విభజన, జాతీయ పౌరసత్వ రిజిష్టర్, అయోధ్య భూవివాదం తదితర కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎళ్ల నుంచి పరిష్కారం కానీ అంశాలు చట్టబద్ధం కావడంతో కాషాయ శ్రేణులు నమో నమ: అని కీర్తిస్తున్నాయి.
మోడీ 2.0
ఏప్రిల్ 11 నుంచి ఏడు విడతలుగా సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగింది. మే 23వ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ అఖండ మెజార్టీ సాధించింది. బీజేపీ 303 సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఎన్డీఏ కూటమి 353 సభ్యులతో బలమైన శక్తిగా అవతరించింది. మోడీ, అమిత్ షాను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీకి శృంగభంగం తప్పలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల్లోకి వెళ్లినా.. గతంలో కంటే పది సీట్ల వరకు గెలుచుకొని విపక్షానికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లే గెలుచుకోవడం, కాంగ్రెస్ కంచుకోట అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓటమి పాలవడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు.
త్రిపుల్ తలాక్
అధికారం చేపట్టాక ప్రధాని మోడీ కీలక అంశాలపై దృష్టిసారించారు. ముస్లిం మహిళల పట్ల కల్పతరువు త్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకొన్నారు. లోక్సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం లభించి.. రాష్ట్రపతి రాజముద్రతో చట్టరూపం దాల్చింది. ఇకపై భర్త.. భార్యకు సరైన కారణం లేకుండా త్రిపుల్ తలాక్ చెబితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇదివరకు అలాంటి చట్టం లేకపోవడంతో కొందరు మహిళలకు ఫోన్లు, వీడియోకాల్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పారు. దేశంలో జరుగుతున్న ఘటన దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ త్రిపుల్ తలాక్ బిల్లును చట్ట బద్ధం చేసి చరిత్ర సృష్టించారు.
కశ్మీర్ విభజన
త్రిపుల్ తలాక్ తర్వాత కీలక పరిణామం జమ్ముకశ్మీర్ విభజన ప్రక్రియే. జమ్ముకశ్మీర్, కశ్మీర్, లడాఖ్ కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలుగా విభజించి అసేతు హిమచలంలో కశ్మీరీలను కూడా భాగస్వాములు చేశారు. కశ్మీర్ విభజనకు ముందే అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఐబీ, రా అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. ఆగస్ట్ 5వ తేదీన కశ్మీర్ విభజన బిల్లు పార్లమెంట్కు చేరడంతో దేశవ్యాప్తంగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. లోక్సభలో బీజేపీకి మద్దతు ఉన్నందున బిల్లు సునాయసంగా గట్టెక్కింది. రాజ్యసభలో ఎన్డీఏ పక్షాల మద్దతుతో ఎలాగోలా గట్టెక్కించారు. రాష్ట్రపతి ఆమోదంతో జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలుగా మారాయి. కశ్మీర్ అసెంబ్లీ ఉన్న కేంద్రప్రాంత పాలిత రాష్ట్రంగా మారింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31వ తేదీ నుంచి ఆ రెండు కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలుగా మనుగడలోకి వచ్చాయి.
హై టెన్షన్
కశ్మీర్ విభజన తర్వాత లోయలో ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. దాయాది పాకిస్థాన్, ఉగ్రవాదుల దాడులు చేయొచ్చనే ఉద్దేశంతో భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించారు. దాదాపు 40 వేలకు పైగా సిబ్బందితో భద్రతను పర్యవేక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పదిరోజులకుపైగా కశ్మీర్లో ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. కశ్మీర్ విభజనపై కమల దళం ఎవరూ చేయనిది మోడీ, అమిత్ షా చేశారని కీర్తించారు. కానీ కాంగ్రెస్ సహా విపక్షాలు మాత్రం విభజన ప్రక్రియను తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి రోజుగా అభివర్ణించారు. కశ్మీర్ విభజన తర్వాత క్రమంగా భద్రతా బలగాలను ఉపసంహరించుకున్నారు. కశ్మీర్ విభజన తర్వాత చిన్నపాటి ఘర్షణ జరగకుండా మోడీ-అమిత్ షా ద్వయం జాగ్రత్తలు తీసుకుంది.
ఎన్ఆర్సీ
దేశంలో అక్రమ చొరబాటుదారులకు చోటు లేదని మోడీ-అమిత్ షా స్పష్టంచేశారు. జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ)ని అసోంలో ప్రకటించారు. జాబితాలో 19 లక్షలమందికి చోటు దక్కలేదు. దీంతో వారి ఆందోళన మిన్నంటింది. ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపి, ఎన్ఆర్సీ సరికాదని పేర్కొన్నాయి. జాబితాలో చోటుదక్కని వారు ట్రైబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చని అమిత్ షా పేర్కొన్నారు. అసోం తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని ప్రకటించి తేనెతుట్టేను కదిపారు అమిత్ షా. ఇటీవల జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్) ఏప్రిల్ నెల నుంచి చేపడుతామని ప్రకటించడంతో.. ఎన్ఆర్సీకి ఎన్పీఆర్ తొలి అడుగు అని విపక్ష నేతలు మండిపుడుతున్నారు.
చిచ్చురేపిన సీఏఏ
ఇటీవల జాతీయ పౌరసత్వ చట్టం (సీఏఏ) చట్టబద్దం చేసేందుకు మోడీ-షా తమదైన చాణక్యం కనబరిచారు. సీఏఏపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో లోక్సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి తీసుకున్నారు. లోక్సభలో ఆమోదం పొందాక, రాజ్యసభలో బిల్లు గట్టేక్కేందుకు తమ భాగస్వామ్య పక్షాలను కూడా ఒప్పించారు. జేడీయూ, టీడీపీ, వైసీపీ కూడా మద్దతు తెలుపడంతో బిల్లు చట్టబద్దం పొందింది. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం పౌరసత్వ సవరణ చట్టంపై సెగలు రాజుకున్నాయి. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, మంగళూరు, కాన్పూర్లో ఆందోళన హింసకు దారితీసింది. ఒక్క ఉత్తర ప్రదేశ్లోనే 18 మంది చనిపోయారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కానీ బిల్లు మాత్రం చట్టబద్దమైపోయింది. పరిస్థితి ఇలా ఉంటే తెరపైకి ఎన్పీఆర్ తీసుకొచ్చి, 2019 ఏడాది మోడీ 2.0 ప్రభుత్వానికి కీలకంగా మారింది.
అయోధ్య వివాదం
2019లోనే ఎన్నో ఏళ్ల నుంచి సాగుతోన్న అయోధ్య భూ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వివాదాస్పద భూమి 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లాకు ఇవ్వాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో 12వ శతాబ్ధంలో ఆలయం ఉన్నట్టు కూడా ఆధారాలు లేవని పేర్కొన్నది. అయితే కళాఖండాలు ఉన్నట్టు చరిత్రకారులు పేర్కొన్నారని మాత్రం గుర్తుచేసింది. వివాదాస్పద స్థలాన్ని రామ్ లాల్లాకు అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన ధర్మాసనం.. ముస్లింలు మసీదు నిర్మించుకోవడానికి అయోధ్యలోనే ఐదెకరాల స్థలం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయోధ్య తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కమలనాథులు, హిందుత్వ వాదులు స్వాగతించారు. కొన్ని ముస్లిం సంస్థలు కూడా స్వాగతించడం విశేషం. నవంబర్ 9వ తేదీన తీర్పు వెలువరితే, ఒక్కరోజు ముందు ప్రధాని మోడీ సుప్రీంకోర్టు తీర్పు ఒకరి విజయం, మరొకరి పరాజయంగా భావించొద్దని సూచించడం విశేషం.