న్యూస్ మేకర్స్ 2019: సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చారిత్రాత్మక తీర్పులు
ఈ ఏడాది అంటే 2019లో వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో ప్రప్రథమంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్. జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేశారు. అయితే అంతకంటే ముందు పలు కీలక కేసుల్లో తీర్పు చెప్పారు. ఇందులో ఒకటి దశాబ్దాలుగా కోర్టుల్లోనే ఉన్న అతి సున్నితమైన అయోధ్య కేసు. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న అయోధ్య కేసులో చారిత్రాత్మకమైన తీర్పు చెప్పి జస్టిస్ రంజన్ గొగోయ్ రికార్డు క్రియేట్ చేశారు. ఇంతకీ రంజన్ గొగోయ్ నేపథ్యం ఏమిటి..?
సుప్రీం కోర్టు 46వ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
రంజన్ గొగోయ్... భారత దేశ సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి. తాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పదవీవిరమణ పొందే నాటికి పలు వివాదాస్పదంగా మారిన కేసుల్లో తీర్పు వెలువరించారు. అయోధ్యలో రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో నవంబర్ 9న తీర్పు చెప్పారు. అయోధ్యకు సంబంధించి తొలిసారిగా 1950లో తొలిసారిగా కోర్టులో కేసు నమోదు అయ్యింది. ఇక అప్పటి నుంచి అయోధ్య రామమందిరం విషయంలో ఏదో రకంగా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి అతి సున్నితమైన కేసులో చీఫ్ జస్టిస్గా ఉన్న రంజన్ గొగోయ్ చారిత్రాత్మక తీర్పును వెలువరించారు.
అయోధ్య తీర్పుతో పాటు పలు కీలక తీర్పులు ఇచ్చిన గొగోయ్
అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమిని రామ్లల్లాకే చెందుతుందని చెబుతూ అదే సమయంలో మసీదు నిర్మాణానికి అయోధ్యలో ఐదెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలంటూ ఆదేశాలు జారీచేశారు. తీర్పుతో దేశం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. అయోధ్య కేసుతో పాటు శబరిమల రివ్యూ పిటిషన్, రాఫైల్ రివ్యూ పిటిషన్, ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయం వంటి కేసుల్లో జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు చెప్పారు.
జస్టిస్ రంజన్ గొగోయ్ చరిత్ర
నవంబర్ 17న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిన రంజన్ గొగోయ్ 1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రుగర్లో జన్మించారు. గొగోయ్ సంపన్న కుటుంబంలో జన్మించారు. తన తండ్రి పేరు కేశబ్ చంద్ర గొగోయ్, అస్సాం ముఖ్యమంత్రిగా 1982లో రెండు నెలల పాటు పనిచేశారు. దిబ్రూగర్లోని డాన్ బాస్కో స్కూలులో గొగోయ్ విద్యనభ్యసించారు. అక్కడి నుంచి ప్రీ యూనివర్శిటీ కోర్సు కోసం ఢిల్లీకి వెళ్లారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీలో డిగ్రీ చేశారు. అనంతరం ఢిల్లీ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. అయితే తన తండ్రి కోరిక మేరకు యూపీఎస్సీ కూడా రాశాడు .అందులో కూడా సక్సెస్ అయ్యారు కానీ తండ్రి కోరికను కాదనలేక యూపీఎస్సీ రాశానని, తనకు మాత్రం అడ్వొకేట్ కావాలనే కోరిక ఉందని తండ్రితో చెప్పారు. ఇదే విషయాన్ని రంజన్ గొగోయ్ సోదరుడు ఇండియన్ ఎయిర్ఫోర్స్ మాజీ ఎయిర్ మార్షల్ అంజన్ గొగోయ్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు.
జస్టిస్ రంజన్ గొగోయ్ కెరీర్
గొగోయ్ బార్ అసోసియేషన్లో 1978లో ఎన్రోల్ అయ్యారు. గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2001లో గౌహతి హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ నియామకం జరిగింది.2010 సెప్టెంబర్ 9న పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. ఇక 2011 ఫిబ్రవరి 12న అదే హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా ప్రమోషన్ పొందారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు జడ్జీగా ప్రమోషన్ పొందారు. 2018 అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణస్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి చాలా కేసుల్లో తీర్పులు చెప్పారు. ఒక్క న్యాయమూర్తిగానే కాదు సుప్రీంకోర్టు పాలనాధిపతిగా పలు సంస్కరణలు తీసుకొచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులను ఏడు భాషల్లో ఉండేలా చూడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
2018లో మీడియా ముందుకు వచ్చిన జడ్జీలు
2018 జనవరి 12న సుప్రీంకోర్టు జడ్జి స్థానంలో ఉన్న రంజయ్ గొగోయ్తో పాటు మిగతా జడ్జీలు జాస్తి చలమేశ్వర్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్లు సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలనాపరమైన అంశాల్లో నెలకొంటున్న లోటుపాట్లను మీడియా ముందుంచారు. కేసుల కేటాయింపులు, తీర్పు వైఫల్యాలను ఎత్తి చూపారు. అంతేకాదు 2014లో స్పెషల్ సీబీఐ జడ్జ్ జస్టిస్ బీహెచ్ లోహియా మృతి కేసును జస్టిస్ అరుణ్ మిశ్రాకు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2004 షోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును జస్టిస్ లోహియా విచారణ చేస్తున్న క్రమంలో ఆయన మృతి చెందారు. ఈ కేసులో పోలీసు ఆఫీసర్లు, బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు.