SPB హాస్పిటల్ బిల్లును బయటపెడుతాను.. దుష్ప్రచారాలు మానండి: ఎస్పీ చరణ్ ఎమోషనల్ పోస్ట్
చెన్నై: ప్రముఖ నేపథ్యగాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అనారోగ్యంకు గురికావడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇటు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఏదో ఒక రూపంలో ఘన నివాళులు అర్పించారు. మరికొందరైతే సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలకు తెరదీశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 51 రోజులు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందారు. అయితే బాలు చికిత్సకు ఆ హాస్పిటల్ బిల్లు బైర్లు కమ్మేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తనయుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ప్రచారంపై చరణ్ క్లారిటీ
తన తండ్రి బాలసుబ్రహ్మణ్యం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న సమయంలో ఎప్పటికప్పుడు తనయుడు చరణ్, ఎస్పీబీ ఆరోగ్యంకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేవాడు. అయితే బాలు మరణం తర్వాత కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా మరోసారి ముందుకు రావాల్సి వచ్చింది. అయితే ఈ సారి మాత్రం తన తండ్రి చికిత్స పొందిన ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్ పై సోషల్ మీడియాలో విషప్రచారం జరుగుతుండటంతో చరణ్ క్లారిటీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
లైవ్కు రావడం చాలా దురదృష్టకరం
తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన చికిత్సను ఎంజీఎం హాస్పిటల్ అందించిందని ఇందుకు వైద్యులను ఆయన ప్రశంసించారు. డాక్టర్లు, నర్సులు తన తండ్రిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం మరువలేనిదని చరణ్ చెప్పారు. వారంతా తమ కుటుంబ సభ్యులతో సమానమని చరణ్ చెప్పారు. ఈ సమయంలో కొందరు ఎంజీఎం హాస్పిటల్పై విషప్రచారం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి చికిత్స అందించిన వైద్యులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పేవారని గుర్తుకు చేసుకున్నారు. ఇప్పుడు ఆ వైద్యులను తాను మిస్ అవుతున్నట్లు ఎస్పీ చరణ్ చెప్పాడు. ప్రస్తుతం తన తండ్రిని కోల్పోయి బాధపడుతున్న సమయంలో ఇలా లైవ్ సెషన్కు రావడం దురదృష్టకరమని ఎస్పీ చరణ్ చెప్పాడు.
ఎంజీఎం హాస్పిటల్ పై విషప్రచారం
ఇక సోషల్ మీడియా వేదికగా బాలసుబ్రహ్మణ్యం హాస్పిటల్లో ఉన్నందుకు గాను ఎంజీఎం యాజమాన్యం అధిక బిల్లును వసూలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని చరణ్ చెప్పాడు. అధిక బిల్లు వేయడంతో తాము తమిళనాడు ప్రభుత్వంను ఆశ్రయించగా ప్రభుత్వం కూడా పట్టించుకోలేదనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని ఎస్పీ చరణ్ చెప్పాడు. ఆ తర్వాత తాను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసినట్లు కూడా ప్రచారం జరిగిందని చరణ్ చెప్పాడు. అంతేకాదు బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించేవరకు బాలు మృతదేహాన్ని అప్పగించలేదనే వార్త ప్రచారం జరిగిందన్నారు.
తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిని క్షమిస్తున్నా
ఇలాంటి దుష్ప్రచారాలకు తెగబడేవారికి ఒక్కటే చెప్పదలుచుకున్నానన్న చరణ్... ఇలాంటి వార్తలు తమ కుటుంబానికి, బాలుకు చికిత్స అందించిన డాక్టర్లను ఎంతో వేదనకు గురిచేస్తాయని మనసును గాయపరుస్తాయని చెప్పాడు. ఇలాంటి వారు ఇంకా ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఎవరైతే ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారో వారిని తాను క్షమిస్తున్నట్లు చెప్పిన చరణ్... ఈ వార్త ప్రచారం చేసిన వ్యక్తులకు వైద్యులు ఎలాంటి చికిత్స అందించారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే దానిపై అవగాహన లేదని చరణ్ చెప్పాడు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు తాను కలిసి సంయుక్త మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తామని చరణ్ చెప్పాడు.
Recommended Video
బాలుకు సంబంధించిన ట్రీట్మెంట్ బిల్లు బయటపెడతాం
సంయుక్త మీడియా సమావేశం పెట్టి వివరాలను వెల్లడించాల్సి రావడం నిజంగా బాధాకరమని చరణ్ చెప్పాడు. త్వరలోనే అన్ని వివరాలు బయటకు వస్తాయని వెల్లడించాడు. తమ కుటుంబం ఎంజీఎంకు రుణపడి ఉంటామని చెప్పారు. తమ సొంత మనిషిలా ఎస్పీబీని భావించి చికిత్స అందించారని ఈరోజు తాను హాస్పిటల్కు వెళ్లకపోవడంతో వారందరినీ మిస్ అవుతున్నట్లు ఎస్పీ చరణ్ చెప్పారు. వైద్యులు నర్సులు తనతో కుటుంబ సభ్యుల్లా మెలిగారని ఎస్పీ చరణ్ వెల్లడించాడు. ఇక ఎండీ డాక్టర్ ప్రశాంత్, ఛైర్మెన్ రాజగోపాలన్లు ప్రతి రోజు తన తండ్రి ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేసేవారని చరణ్ గుర్తు చేసుకున్నాడు. త్వరలోనే తన తండ్రి చికిత్సకు సంబంధించిన బిల్లులు బయటకు ఇస్తామని వెల్లడించారు చరణ్. అంతవరకు సోషల్ మీడియాలో ఎలాంటి దుష్ప్రచారాలు చేయొద్దని చరణ్ కోరారు. ఇక తన తండ్రి చికిత్స కోసం ఒక ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చిన సమయంలో ఎంజీఎం హాస్పిటల్ యాజమాన్యం అపోలో వైద్యులను సంప్రదించగా వెంటనే వారు ఆ ఎక్విప్మెంట్ను పంపినందుకు ధన్యవాదాలు తెలిపాడు ఎస్పీ చరణ్.