అది విని ఎగిరి గంతేసిన మందుబాబులు.. అంతలోనే ఆశలు ఆవిరి.. ప్చ్..
లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడటంతో మందుబాబులకు మునుపెన్నడూ లేని కష్టం వచ్చిపడింది. గతంలో మహా అయితే ఏదైనా ప్రత్యేక సందర్భంలో రెండు,మూడు రోజులు షాపులు మూసివేసేవారు. ఇప్పుడు దాదాపుగా నెల రోజుల నుంచి మద్యం షాపులు తెరుచుకోకపోవడంతో మందుబాబులు అల్లాడిపోతున్నారు. మందు లేక మానసిక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు తమ మొర ఆలకించి కనీసం రోజుకు ఓ రెండు గంటలైనా మద్యం దుకాణాలను ఓపెన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో పుట్టుకొచ్చిన ఓ ఫేక్ మెసేజ్ మందుబాబుల ముఖాల్లో ఎక్కడ లేని ఆనందం తీసుకొచ్చింది. కానీ కొద్దిసేపటికే అది ఫేక్ అని తెలియడంతో వారి ఆశలు ఆవిరైపోయాయి.
అది ఫేక్.. అసలు నిజమేంటంటే..
మమతా బెనర్జీ సర్కార్ మద్యం హోమ్ డెలివరీకి నిర్ణయం తీసుకుందని బుధవారం(ఏప్రిల్ 8) ఓ ఫేక్ మెసేజ్ పుట్టుకొచ్చింది. బార్లు,రెస్టారెంట్లకు కూడా మద్యం హోమ్ డెలివరీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. పలు న్యూస్ పోర్టల్స్,స్థానిక టీవీ చానెళ్లు కూడా కథనాలు ప్రసారం చేశాయి. ఈ వార్తలు చూసి మందుబాబులు సంబరపడిపోయారు. అయితే కాసేపటికే రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎక్సైజ్ చట్టంలోని పాత నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలకు హోమ్ డెలివరీకి అవకాశం ఉందని.. అయితే ఇది సాధారణ రోజుల్లో మాత్రమేనని, లాక్ డౌన్ పీరియడ్కు వర్తించదని ఓ సీనియర్ ఎక్సైజ్ అధికారి తెలిపారు.అది కూడా స్థానిక సంబంధిత అధికారులు,స్థానిక పోలీసుల అనుమతితోనే దానికి అనుమతిస్తారని చెప్పారు.
వాట్సాప్ సర్క్యులేట్ అయిన ఫేక్ మెసేజ్
ఇక వాట్సాప్లో సర్క్యులేట్ అయిన ఫేక్ మెసేజ్ ప్రకారం.. ఇప్పటినుంచి లాక్ డౌన్ పీరియడ్ ముగిసేవరకు మీ నివాసాలకు సమీపంలోని మద్యం దుకాణాలు,బార్స్ లేదా రెస్టారెంట్స్ నుంచి ఫోన్ ద్వారా మద్యం ఆర్డర్ చేయవచ్చు. ఉదయం 11గం. నుంచి మధ్యాహ్నం 2గం. వరకు హోమ్ డెలివరీ ద్వారా మద్యం సప్లై చేస్తారు. మద్యం దుకాణం వద్దకు ఎవరినీ అనుమతించరు. డెలివరీ బాయ్స్ మాత్రమే మద్యం సప్లై చేస్తారు. మద్యం హోమ్ డెలివరీ కోసం లిక్కర్ షాపు యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్లో పాసులు పొందాలి. అయితే ఇదంతా వట్టి పుకారేనని.. ఇందులో ఏమాత్రం నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఫేక్ మెసేజ్పై విచారణ
ఈ ఫేక్ మెసేజ్పై విచారణ జరుపుతున్నామని కోల్కతా సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. బెంగాల్లో కేవలం స్వీట్ షాప్స్కు మాత్రమే అనుమతిచ్చామని.. మద్యం షాపుల హోమ్ డెలివరీకి అనుమతి లేదని చీఫ్ సెక్రటరీ రాజీవ్ సిన్హా తెలిపారు. స్వీట్ షాప్స్కు కూడా కొన్ని గంటలే అనుమతిచ్చామని తెలిపారు. ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ప్రజలు ఈ ఫేక్ మెసేజ్లను నమ్మవద్దని.. ప్రభుత్వం ఇచ్చే అధికారిక ప్రకటనలనే నమ్మాలని సూచించారు. అనవసరంగా ఫేక్ మెసేజ్లను ఫార్వార్డ్ చేసి గందరగోళం సృష్టించవద్దన్నారు.
Recommended Video
ఫేక్ మెసేజ్లకు అడ్డుకట్ట
ఫేక్ మెసేజ్లకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఫీచర్ను వాట్సాప్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి ఏ యూజర్ అయిన ఒకసారి ఒకరికి మాత్రమే మెసేజ్ పంపించేలా చర్యలు తీసుకుంది.ఈ కొత్త నిబంధనను మంగళవారం (ఏప్రిల్ 7) నుంచే అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కరోనాపై పుట్టుకొస్తున్న పుకార్లకు కొంతలో కొంతైనా చెక్ పడే అవకాశం ఉంది.