కరోనా వార్నింగ్: వచ్చే 2.5 నెలలు జాగ్రత్త - ముందంజలో 3 వ్యాక్సిన్లు: కేంద్ర మంత్రి హర్షవర్థన్
లాక్ డౌన్ నుంచి ప్రజా రవాణా వ్యవస్థ తప్ప దాదాపు అంతటా సడలింపులు ప్రకటించడంతో దేశంలో కదలికల వేగం మళ్లీ పెరిగింది. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా వేగంగానే సాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో కొత్తగా 63,371 కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74.30లక్షలకు, మరణాల సంఖ్య 1.13లక్షలకు పెరిగాయి. 65లక్షలపైచిలుకు మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8లక్షలుగా ఉంది. కాగా, కరోనాకు సంబంధించి కేంద్రం తాజా హెచ్చరికను జారీ చేసింది.
కరోనా మహమ్మారిపై పోరాటంలో రాబోయే రెండున్నర నెలలు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శీతాకాలంతో పాటు పండుగల సీజన్ వల్ల వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ప్రతి ఒక్క పౌరుడూ తన వంతు కర్తవ్యంగా జాగ్రత్తలు పాటించాలని, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కొవిడ్-19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇకపోతే,
ప్రపంచమంతా ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తోన్న కొవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి మంత్రి హర్షవర్దన్ కీలక అప్ డేట్స్ వెల్లడించారు. ప్రస్తుతం మూడు వ్యాక్సీన్లు ముందంజలో ఉన్నాయని, వీటిలో ఒకటి స్టేజ్-3 క్లినికల్ ట్రయల్స్ దశలో ఉండగా, మరో రెండు స్టేజ్-2 దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా విరుగుడు వ్యాక్సిన్ అభివృద్దిలో భారత్ కీలక భూమిక పోషిస్తుందని, త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందని అన్నారు.
కొవిడ్-19 నియంత్రణ చర్యలపై చర్చించేందుకు మంత్రి హర్షవర్దన్ శుక్రవారం కేంద్ర ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, సీఎస్ఐఆర్కి చెందిన డైరెక్టర్లు, శాఖాధిపతులతో సమావేశం అయ్యారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ ప్రభావానికి గురయ్యాయని, కొద్దిపాటి జాగ్రత్తలతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని మంత్రి అన్నారు.