మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అభ్యర్థి..శరద్ పవార్ రేసులో లేరు: సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై ఇటు బీజేపీ అటు శివసేనల మధ్య దూరం పెరుగుతోంది. శివసేన పార్టీ మాత్రం తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తుండగా.. బీజేపీ మాత్రం సీఎం సీటును వదులుకోకూడదని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ మరో షాకింగ్ కామెంట్ చేశారు.
కొత్త సీఎంగా శివసేన అభ్యర్థి
మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రిగా శివసేన పార్టీ అభ్యర్థే ఉంటారని జోస్యం చెప్పారు ఆపార్టీ సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్. శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని చెప్పారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 12 రోజులు గడుస్తున్నప్పటికీ రెండు మిత్రపక్షాల మధ్య ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా, ముఖ్యమంత్రి పీఠంపై స్పష్టత రాకపోవడంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. త్వరలోనే శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పిన సంజయ్ రౌత్ రాష్ట్రంలో నెలకొన్న గ్రహణం తొలిగిపోతుందని చెప్పారు.
సీఎం పోస్టుకు రేసులో లేని శరద్ పవార్
ముఖ్యమంత్రి శివసేన పార్టీ నుంచే ఉంటారని ఘంటాపథంగా చెప్పిన సంజయ్ రౌత్... ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రేసులో లేరని స్పష్టం చేశారు. శివసేన హంగామా చేస్తోందని బీజేపీ వాదిస్తోందని తాము హంగామా చేయడం లేదని న్యాయం అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని సంజయ్ రౌత్ తెలిపారు. పదవులు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పిన బీజేపీ మాటమీద నిలబడటం లేదని దుమ్మెత్తిపోశారు సంజయ్ రౌత్. ఎన్నికలకు ముందు మాట ఇచ్చి ఇప్పుడు ఎలా విస్మరిస్తుందని అలాంటి పార్టీ అధికారంలోకి వస్తే హామీలను ఎలా నెరవేరుస్తుందని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్ లైన్ నవంబర్ 9
ఇక బీజేపీ 105 స్థానాలు గెలువగా శివసేన 56 సీట్లు సొంతం చేసుకుంది. ఎన్సీపీ 54 కాంగ్రెస్ 44 స్థానాలు దక్కించుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 145 మ్యాజిక్ ఫిగర్. ఇక స్వతంత్రులు ఇతర చిన్న పార్టీలు కలిపి మొత్తం 29 సీట్లు గెలిచాయి. ఇక ఎనిమిది మంది ఇండిపెండెంట్లు శివసేన పార్టీకి మద్దతు తెలపడంతో ఆపార్టీ బలం 64కు చేరింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పాటుకు చివరి తేదీ నవంబర్ 9. ఆసమయంలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రం రాష్ట్రపతి పాలనకిందకు వచ్చే అవకాశం ఉంది.